వర్ధన్నపేట/హనుమకొండ, మార్చి 16: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేయడం అంటే దేశంలోని మహిళలపై ఉక్కుపాదం మోపినట్టేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీజేపీ కక్షపూరితంగా అరెస్ట్ చేయించిందని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ మద్యం కేసుతో కవితకు ఎలాంటి సంబంధం లేకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించాయని విమర్శించారు. ఆయా పార్టీల కుట్రలను బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటుందని హెచ్చరించారు.
ధర్నాలో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, ఇండ్ల నాగేశ్వర్రావు, చింతల యాదగిరి, తూళ్ల కుమారస్వామి, మనోజ్కుమార్, రజణీ, గోపాల్రావు, పూజారి రఘు, రవి పాల్గొన్నారు. అలాగే, కవిత అరెస్టుకు నిరసనగా బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాళోజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సమచారం లేకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం బీజేపీ కుట్రేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. ఎన్నికల ముందు ఈడీ వస్తుందనే నిజం తేటతెళ్లమైందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, కార్పొరేటర్లు సొదా కిరణ్, ఇమ్మడి లోహిత, బొంగు అశోక్ యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్లు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీముద్దీన్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమమని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజీపీ చిల్లర చేష్టలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, సిద్ధం రాజు, బోగి సువర్ణా సురేశ్, మాజీ కార్పొరేటర్లు రాజేందర్, విజయ్భాస్కర్రెడ్డి, అనిల్, అజయ్ పాల్గొన్నారు.
నమస్తేతెలంగాణ నెట్వర్క్ : ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల సెంటర్లో బీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే, నల్లబెల్లి మండలకేంద్రంలో కూడా పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖానాపురంలో నిర్వహించిన నిరసనలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నెక్కొండలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి పాల్గొన్నారు.
ఎల్కతుర్తిలో ప్రధాన రహదారిపై ఎంపీపీ మేకల స్వప్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పరకాల పట్టణంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం హేయమైన చర్య అని భారత జాగృతి యువజన రాష్ట్ర నాయకుడు అమ్మ అశోక్ అన్నారు.