కరీమాబాద్, డిసెంబర్ 2: ప్రతి పేదవాడికి సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ఈ మేరకు వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నది. కంటివెలుగు కార్యక్రమంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. దీర్షకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఇండ్లకు నేరుగా వెళ్లి వైద్య సిబ్బందితో ప్రభు త్వం నెలనెలా ఉచితంగా మందులు అందజేస్తున్నది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అనేక కొత్త దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. తాజాగా పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ 32వ డివిజన్లోని బీఆర్నగర్లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖాన ముస్తాబైంది. ఈ ఆస్పత్రిలో త్వరలోనే సేవలు ప్రారం భం కానున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీహెచ్సీల ద్వారా పట్టణాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మా డివిజన్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం సంతోషకరం. దినసరి కూలీలు ఉన్న బీఆర్నగర్లో బస్తీ దవాఖాన సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
– పల్లం పద్మ, 32వ డివిజన్ కార్పొరేటర్