వాజేడు, ఏప్రిల్ 9: మండలంలోని టేకులగూడెం గ్రామ పంచాయతీ పరిధి లొట్టిపిట్ట గండి అటవీ ప్రాంతంలో గిరిజనుల ఆరాధ్యదైవం బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర ప్రారంభమైంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు, హైదరాబాద్ టు భూపాలపట్నం ఎన్హెచ్-163కు కిలోమీటర్ దూరంలోని గుట్టపై శనివారం రాత్రి నుంచి లక్ష్మీదేవర, ముత్యాలమ్మ, పోచమ్మకు గ్రామస్తులు మొక్కులు పెట్టారు. డప్పచప్పుళ్లతో గోదావరికి వెళ్లి కొత్త కుండల్లో శుద్ధజలాలను తెచ్చి స్వామివారికి అభిషేకం చేయగా జాతర ప్రారంభమైంది. ఆదివారం జిల్లాతోపాటు పక్క జిల్లాలైన కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, పక్కరాష్ర్టాలైన చత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించారు. కోళ్లు, మేకలు బలిచ్చి, వంటలు వండుకొని ఇంటిల్లిపాది భోజనం చేసి ఆనందంగా గడిపారు.
ఏటా శ్రీరామనవమి జరిగిన మొదటి ఆదివారం ఈ జాతరను టేకులగూడేనికి చెందిన పూజారులు, భక్తులు నిర్వహిస్తారు. శనివారం రాత్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గిరిజన నృత్యాలు చేశారు. గుట్టపై వెలసిన స్వయంభూ బీరమయ్యను ఆదివారం భక్తులు కుటుంబ సమేతంగా ఎన్హెచ్-163 నుంచి కిలోమీటర్ కాలికడనక వచ్చి మొక్కులు చెల్లించారు. గోదావరి అవతలి పాంతం నుంచి భక్తులు నాటుపడవల్లో వచ్చారు. స్వామివారిని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దర్శించుకున్నారు. కాగా, మండలంలోని వెల్విజన్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో కుమ్మరి రాంబాబు, కేశవ్ బృందం ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. చెరుకురు గ్రామానికి చెందిన కొత్తగట్టు శ్రీనివాసరావు వెంకటేశ్వర బోర్వెల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా తాగునీటిని పంపిణీ చేశారు. కాగా, ఈ జాతర వచ్చే ఆదివారం తిరుగువారం పండుగతో ముగుస్తుందని ఆలయ పూజారి వాసం బాబు తెలిపారు.