సుబేదారి, జూన్ 28 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలని, అందుకు స్థానిక అవసరాల రీత్యా వ్యాపారాలు చేసుకోవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. డీసీసీబీ ఉమ్మడి వరంగల్ జిల్లా మహాజన సభను బుధవారం హనుమకొండలో నిర్వహించారు. బ్యాంకు లావాదేవీలు, కొత్త పాలసీల గురించి సీఈవో చిన్నారావు వివరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వరంగల్ డీసీసీబీ మూడు సంవత్సరాల కాలంలో గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించిందన్నారు. రూ.1694 కోట్ల టర్నవర్తో పాటు రూ.12.94కోట్ల లాభాలు సాధించినట్లు చెప్పారు. రికవరీలో 98 శాతానికి చేరుకున్నామని, రాష్ట్రంలోనే బ్యాంకు మూడో స్థానంలో ఉందన్నారు. 2022-23 ఆడిట్ రిపోర్ట్లో 93 మార్కులతో ఏ గ్రేడ్లో వచ్చిందని, ఉమ్మడి జిల్లాలో గతంలో 19 బ్రాంచ్లు ఉండగా, ప్రసుత్తం 32 బ్రాంచ్ల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక పురోగతే లక్ష్యంగా 42 పీఏసీఎస్లకు నాబార్డు నుంచి స్థానిక అవసరాలను బట్టి వ్యాపారాలు చేసుకోవడానికి రూ.54కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు.
పీఏసీఎస్ల ద్వారా మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చైర్మన్ చెప్పారు. ఒకే చోట నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఔట్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జనరిక్ మందుల షాప్ల ఏర్పాటుకు కూడా బ్యాంకు పాలకమండలి నిర్ణయం తీసుకుందని, పీఏసీఎస్లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీ నాయక్, పాలక మండలి సభ్యులు హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్, కంది శ్రీనివాస్రెడ్డి, అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.