హనుమకొండ సిటీ, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు బడీడు పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్కూల్ మేనేజ్మెంట్లు, ప్రజాప్రతినిధులతో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రధాన ఉద్దేశం..
బడీడు పిల్లలందరినీ గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెం చడం, కమ్యూనిటీ భాగస్వామ్యంతో బడులను బలోపేతం చేయడం, 5వ తరగతి పూర్తి చేసిన వారిని యూ పీఎస్లో చేర్పించడం, 7వ తరగతి పూర్తి చేసిన వారు హైస్కూల్కు 100 శాతం బదిలీ అయ్యేలా ఉపాధ్యాయులు చూడనున్నారు. అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను భవిత కేంద్రాల్లో చేర్పించడం, అంగన్వాడీ సెంటర్లలోని ఐదేళ్లు దాటిన పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. 3 నుంచి 9 వ తేదీ వరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు బ్యానర్లు, కరపత్రాలతో వాడవాడలా ర్యాలీలు తీసి ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
పాఠశాలల పునః ప్రారంభమయ్యే 12వ తేదీ నుంచి 17 వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించనున్నారు. ఇంగ్లిష్ మాధ్యమం, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, తొలిమెట్టుకు ముందు, ఆ తర్వాత విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై తల్లిదండ్రులకు వివరించనున్నారు. బాలికల విద్య ప్రాముఖ్యతపై సందేశాలు ఇవ్వడానికి మహిళా అధికారులను ఆహ్వానించడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి స్థిరపడిన బాలికలు, ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని సత్కరించనున్నారు. కేజీబీవీల ప్రాముఖ్యతను వివరించి, సామూహిక అక్షరాభ్యాసం చేయించనున్నారు.