కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. 9 కేటగిరీల్లో హనుమకొండ జిల్లాలో 27, వరంగల్ జిల్లాలో 27 పంచాయతీలు అవార్డులు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఏటా తగ్గిస్తోందని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. అనంతరం సర్పంచ్లు, కార్యదర్శులను సన్మానించి, పురస్కారాలు అందజేశారు.
– హనుమకొండ, మార్చి 25
హనుమకొండ, మార్చి 25 : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. 9 కేటగిరీల్లో హనుమకొండ జిల్లాలో 27, వరంగల్ జిల్లాలో 27 పంచాయతీలు అవార్డులు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత పాలకుల హయాంలో పంచాయతీలకు నిధులు సరిపడా లేక, అభివృద్ధికి నోచుకోక సర్పంచ్లు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. పంచాయతీల్లో వచ్చే నిధులతోనే అరకొర పనులు చేపట్టే వారన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అనే నానుడిని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు.
పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి పకడ్బందీగా అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని స్పష్టం చేశారు. సర్పంచ్ల మధ్య పోటీ తత్వం పెరిగి మరింత అభివృద్ధి జరుగాలనేదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. పేదరికం లేని, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ, సమృద్ధి నీరు, పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలతో కూడిన స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహ పూర్వక వంటి మొత్తం 9 అంశాల్లో ఒకో విభాగానికి 3 చొప్పున గ్రామాలను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. తాను అదృష్టవంతుడిని అన్న మంత్రి ఎర్రబెల్లి ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు దకడం గర్వంగా భావిస్తున్నానన్నారు. 40 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్నా.. ఇన్నేళ్లలో ఏ నిధులు కూడా మంచినీళ్లకే సరిపోయేవి కావని, సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకు ఏ సీఎం కూడా చేయని విధంగా పల్లెల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. శ్మశానవాటికల్లో కూడా దేవాలయాల మాదిరిగా అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
కేంద్రం నిధులు తగ్గించింది
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను తగ్గిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇప్పటికి రూ. 707 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు, రూ. 600 కోట్లు ఉపాధి హామీ నిధులు రావాల్సి ఉందని అన్నారు. అలాగే, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ప్రతి సంవత్సరం తగ్గిస్తోందని చెప్పారు. గతంలో గీసుగొండ మండలం గంగదేవిపల్లికి మాత్రమే అవార్డులు వచ్చేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని విరవించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇప్పటివరకు రూ.15 వేల కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. గతంలో సిబ్బంది వేతనాలు రూ.500 ఉంటే ఇప్పుడు రూ.8,500 ఇస్తున్నామన్నారు.
సర్పంచ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా చేయాలని మంత్రి సూచించారు. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని రకాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని మంత్రి తెలిపారు. పంటనష్టం పరిహారం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పిచ్చిపిచ్చి గా మాట్లాడుతున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పరిహారం కూడా అందడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. అవార్డు పొందిన గ్రామ పంచాయతీలకు అదనంగా రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాగా, అవార్డులు వచ్చిన సర్పంచ్లను మంత్రి ఎర్రబెల్లి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
కఠోర శ్రమతోనే అవార్డులు
మా గ్రామ పంచాయతీకి తొమ్మిది విభాగాల్లో అన్నింటా అవార్డులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉన్నప్పటికి ఈ అవార్డులు వచ్చేందుకు దీని వెనుక కోఠర శ్రమ ఉంది. ప్రభుత్వాల నిధులు కేటాయింపుతో పాటు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాం. ప్రజలు నా ఇంటికి రాకుండా నేనే పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటా. అవార్డులు లక్ష్యంగా ప్రజల సమక్షంలో పనిచేస్తున్నా. రకరకాల అభివృద్ది పనులు చేసుకున్నాం. లంచం అనే మాట ఉండదు. మా గ్రామంలోని వర్షపు నీరు చుక్కకూడా బయటకు పోకుండా ఇంకుడు గుంతలు లాంటివి నిర్మించుకున్నారు. అలాగే, ప్రభుత్వం ఇచ్చే నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎం సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, హనుమకొండ అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, అవార్డు గ్రహీతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
– అల్లం బాల్రెడ్డి,
మరియపురం సర్పంచ్, వరంగల్ జిల్లా అవార్డును ప్రజలకు అంకితం చేస్తున్నా
ప్రభుత్వం ఇస్తున్న అవార్డులను ముల్కనూరు ప్రజలకు అంకితం చేస్తున్నా. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నాం. జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడు అంశాల్లో ముల్కనూరుకు అవార్డులు వచ్చాయి. సీఎం కేసీఆర్ దూరదృష్టి, నిధుల కేటాయింపు, ప్రజల భాగస్వామంతో పనిచేయడంతోనే అవార్డులు దక్కాయి. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– మూడేళ్ల కొమురయ్య, ముల్కనూరు సర్పంచ్