పరకాల, డిసెంబర్ 16 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, హామీలతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బ స్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ స్వయం ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పేరుతో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించిందని ఆ గ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన చెందారు. తమ కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కమలాపూర్లో నిరసన..
కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలకేంద్రంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దంతా ఆటో నడిపినా కుటుంబం గడిచే పరిస్థితి లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఎవరూ ఆటో ఎక్కడం లేదని వాపోయారు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. అనంతరం పరకాల-హుజూరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి, ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణరావు, ఆటో డ్రైవర్లు రవి, కుమారస్వామి, రాజు పాల్గొన్నారు.
ఉపాధి కోల్పోతున్నాం..
వర్ధన్నపేట: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు అన్నారు. ఈ మేరకు వర్ధన్నపేట పట్టణంలో ఆందోళన చేశారు. ఆటో యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేసి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికులు ఆటోల్లో ఎక్కడం లేదన్నారు. దీంతో ఫైనాన్స్లో రుణాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఫైనాన్స్ కంపెనీలు ఆటోలను తీసుకెళ్తే డ్రైవర్లు రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళనలో ఆటో డ్రైవర్స్ యూనియన్ మండల బాధ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.