లింగాలఘనపురం : నాడు బావిలో నీళ్లు లేవు. ఉన్నా పొలానికి పారిద్దామన్నప్పుడు కరంటు సక్కగ ఉండది. అయినా ధైర్యం చేసి సాగుచేద్దామన్నా పెట్టుబడికి పైసలుండకపోయేది. బయట అప్పు తెస్తే పంట మీద వచ్చిన లాభం వడ్డీలకే కట్టుడయ్యేది. ఇవి చాలవన్నట్టు నకిలీ విత్తనాలు, జాగారం చేస్తే గానీ దొరకని ఎరువులు. ఇన్ని కష్టాల నడుమ వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉండేది. నాడు కరువు ప్రాంతమైన జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన బెజ్జం చంద్రయ్య కూడా ఇలాగే విసిగిపోయాడు. వచ్చిందే చాలు అనుకొని తన ఐదెకరాల భూమిని కౌలుకు ఇచ్చాడు.
కౌలుతో వరిపై రూ.1500, ఖుష్కి ద్వారా నాలుగున్నర ఎకరాలకు రూ.9వేలు వచ్చేవి. ఆ తర్వాత ఆటో కొనుగోలు చేసి గ్రామంలో కిరాయికి నడుపుకొంటూ వచ్చిన కూలితో బతికేవాడు. ఇలా చాలీచాలని డబ్బులతో కాలం గడుపుతున్న సమయంలో వెలుగులా వచ్చిన ‘రైతుబంధు’ చంద్రయ్య జీవన విధానాన్నే మార్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలోని జలవనరులన్ని కళకళలాడినట్టే లింగాలఘనపురం చెరువులోకి పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. ఇటు వ్యవసాయ బావిలో నీళ్లు పైకి తేలుతున్నాయి. మునుపటి లెక్క కాకుండా 24గంటల కరంటు వస్తున్నది. ఏడాదికి రూ.50వేలు పెట్టుబడి సాయం వచ్చి చంద్రయ్య ఖాతాలో జమవుతున్నాయి. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా లేదు. ఇలా దండుగ అనుకున్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మార్చి.. మట్టినే నమ్ముకున్న రైతుకు నేనున్నా అని భరోసా ఇవ్వడంతో చంద్రయ్య తన ఆటోడ్రైవర్ వృత్తిని వదిలేశాడు. కొండంత ధైర్యం.. పెట్టుబడి సాయం వస్తున్నదన్న ఉత్సాహంతో మళ్లీ నాగలి పట్టి పొలంలోకి దిగాడు. తన ఐదెకరాల్లో దర్జాగా వరి సాగు చేసుకుంటున్నాడు.
సంబురంగా సాగు చేసుకుంటున్న..
ఊళ్లో నాకు ఐదెకరాల భూమి ఉంది. వ్యవసాయ బావి తలాపునే పెద్దచెరువు ఉన్నా అందులోకి అస్సలు నీళ్లే రాకపోయేది. బావిలో ఉన్న నీళ్లు అర ఎకరానికి కూడా చాలేటియి కాదు. ఇటు నీళ్లులేక.. ఉన్న నీటికి కరంటు లేక వరి పొలానికి పెట్టలేక నెత్తిపట్టుకునేది. జనగామలో ఉన్న అడ్తివ్యాపారి దగ్గర పెట్టుబడి కోసం అప్పు తెచ్చిన. పండిన పంటనంతా ఆయనకే అమ్మేలా ఒప్పందం చేసుకున్న. గిదంతా ఎందుకని కౌలుకిచ్చిన. ఏడాదికి రూ.10వేలు వచ్చేటియి. అటెనుక ఆటో కొని నడుపుకునేది. ఇంతల సీఎం కేసీఆర్ పుణ్యమా అని మా ఊరి చెర్లకు మస్తు నీళ్లు అచ్చినయ్. నీళ్లు రావ డం, ప్రతి యేడు రైతుబంధు సాయం (5 ఎకరాలకు రూ.50వేలు) అందుతున్నాయి. కరంటు కూడా ఫ్రీగా వత్తాంది. గివన్ని ఉన్నంక ఆటో ఎందుకని ఐదేళ్ల నుంచి మంచిగ ఎవుసం చేసుకుంటున్న. కూలీలతో పనిచేయించుకుంట సంతోషంగా ఉన్న. ఇదంతా కేసీఆర్ సారు వల్లే సాధ్యమైంది.
– బెజ్జం చంద్రయ్య, రైతు, లింగాలఘనపురం