పోచమ్మమైదాన్, ఏప్రిల్ 18: వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకులకు మాయమాటలు చెప్పి బంగారం, నగదును దోచుకుంటున్న మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6,60,000 విలువైన సొత్తును సీసీఎస్, మట్టెవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ బి.నందిరాం నాయక్ గురువారం మట్టెవాడ పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన చుంచు స్వప్న అలియాస్ సానియా వరంగల్ కాశీబుగ్గలో నివాసముంటున్నది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అమాయకులను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చే మహిళలు, వృద్ధులను లక్ష్యంగా పెట్టుకుని మోసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ముస్లిం మహిళగా బుర్ఖా వేసుకుని రోజూ ఎంజీఎం దవాఖానలోని వార్డుల్లోకి వెళ్లి, పేషెంట్ల వద్ద ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తూ వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రణాళిక వేసుకుంది. మీకు సర్కారు నుంచి లోన్లు ఇప్పిస్తానంటూ నమ్మించి దవాఖాన బయటకు వారిని తీసుకెళ్లేది. ముందుగా మీరు మీసేవ సెంటర్ వద్ద ఫొటో దిగాల్సి ఉంటున్నందని చెబుతుండేది. ఈ సమయంలో మీ ఒంటిపై బంగారు వస్తువులు ఉంటే మిమ్మల్ని పేదవారిగా గుర్తించరని చెబుతూ నమ్మకం కల్పిస్తుంది. దీంతో వారు ఒంటిపై ఉన్న బంగారు వస్తువులను ఆమెకు ఇచ్చిన తర్వాత బాండ్ పేపర్ తీసుకొస్తానని చెప్పి ఉడాయిస్తుంది. ఈ బంగారు ఆభరణాలను అమ్ముకొని తన అవసరాలను తీర్చుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నది.
పదేళ్ల క్రితం స్వప్నపై ములుగు పీఎస్లో రాబరి కేసు నమోదైంది. అలాగే, లోన్లు ఇప్పిస్తానని నమ్మించి మహిళల నుంచి బంగారం దొంగిలించిన విషయమై 2023లో హనుమకొండ, ములుగు పీఎస్ల్లో కేసులు నమోదై అరెస్టు అయి, జైలుకు వెళ్లి వచ్చింది. ఆరు నెలల క్రితం స్వప్న మొదటి భర్త ఫిరోజ్ ఆటోనగర్ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. అనంతరం అతడి స్నేహితుడైన ఖాజాపాషాను మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
గత ఫిబ్రవరి 25న స్వప్న భర్త ఖాజాపాషా ఎంజీఎం దవాఖానకు వచ్చి పేషెంటు వద్ద ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెను గోపాలస్వామి గుడి వద్దకు తీసుకెళ్లి బెదిరించి ఒంటిపై ఉన్న జత బంగారు కమ్మలు, రెండు పుస్తెలు, రూ. వేయి నగదును దోచుకున్నాడు. మార్చి 7న ఎంజీఎం దవాఖానకు వచ్చిన ఓ మహిళను వీరిద్దరు బెదిరించి జత చెవి కమ్మలు, నోకియా కీ ప్యాడ్, సెల్ఫోన్, రూ. 500 దోచుకున్నారు. 26న కూడా ఎంజీఎం ఆసుప్రతిలో ఓ మహిళకు లోన్ ఇప్పిస్తానని మాయమాటలతో నమ్మించి, ఆమె నుంచి రెండు బంగారు పుస్తెలు, గుండ్లు తీసుకున్నారు. ఇదే క్రమంలో వీరు ఆటోనగర్లో అద్దె ఇల్లు తీసుకుని రెండు రోజులు నివాసముండి, అక్కడ ఇంటి యాజమానికి లోన్లు ఇప్పిస్తానని నమ్మించి, అతడి నుంచి బంగారు ఉంగరం దొంగిలించి పారిపోయారు. అలాగే, ఈ నెల 6న భార్యాభర్తలు కలిసి మళ్లీ ఎంజీఎం దవాఖానకు వచ్చి ఓ మహిళ నుంచి జత కమ్మలు, మూడు జతల చెవి పోగులు, రెండు పుస్తెలు, బంగారు గుండ్లు, రూ. 7 వేల నగదు దొంగిలించారు. ఈ నెల 10న ఓ మహిళను నమ్మించి ఆమె నుంచి బంగారు పుస్తెలతాడు, జత కమ్మలు దొంగిలించి, హనీఫ్ అనే మరొక వ్యక్తి ద్వారా బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో కుదువ పెట్టి రూ. 98 వేల నగదు తీసుకున్నారు.
మట్టెవాడ పోలీస్స్టేషన్లో వరుస దొంగతనాలు నమోదు కావడంతో సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ బారి, అడిషనల్ డీసీపీ రవీందర్ పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ అబ్బయ్య, మట్టెవాడ సీఐ తుమ్మ గోపి, సాంకేతిక పరిజాన నిపుణుడు సల్మాన్ పాషా, సీసీఎస్, మట్టెవాడ క్రైమ్ టీమ్స్ కలిసి పక్కా సమాచారం మేర కు దొంగిలించిన బంగారాన్ని పిన్నావారి వీధిలో అమ్ముతున్న చుంచు స్వప్న అలియాస్ సానియా, ఆమె భర్త ఎండీ ఖాజాపాషాతోపాటు మరో వ్యక్తి ఎండీ హనీఫ్ను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5.80 లక్షలు విలువ చేసే బంగారు నగలు, నోకియా కీ ప్యాడ్, మొబైల్, రూ. 80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.