‘సీఎం కప్’ పోటీలు క్రీడాకారుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. మండల స్థాయిలో ప్రతిభచూపిన వారితో సోమవారం ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాకేంద్రాల్లో జిల్లాస్థాయి టోర్నమెంట్లు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జేఎన్ఎస్లో ఈ పోటీలు అట్టహాసంగా మొదలు కాగా మూడు రోజుల పాటు సాగే క్రీడా పండుగలో 1500మంది పాల్గొననున్నారు. మొత్తం 18 అంశాల్లో నిర్వహించే పోటీలను అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ప్రారంభించి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు పేరు తేవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. తొలిరోజు పరుగుపందెం, కబడ్డీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, హాకీ పోటీల్లో హోరాహోరీ తలపడ్డారు.
అలాగే భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు దిగిన వీరిద్దరు నువ్వా నేనా అన్నట్టు తలపడగా ఉత్కంఠ పోరులో ఎమ్మెల్యే పైచేయి సాధించారు. ఏటూరునాగారంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ జగదీశ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్.. మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు పోటీలను ప్రారంభించారు. వరంగల్లో కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నరేందర్, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొని క్రీడాజ్యోతిని వెలిగించారు. జనగామ లో కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మె ల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య హాజరై పోటీలను ప్రారం భించి ఉత్సాహం నింపారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 22