జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో తలదించుకునేలా పెన్షన్లు ఉన్నాయని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు తలెత్తుకుని బతికేలా చేశారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన నీలాంబరం యాదవ్ అధ్యక్షతన జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే గండ్రతో పాటు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడని, దివ్యాంగులు గౌరవంగా జీవించాలని వారి పెన్షన్ను రూ. 4 వేలు చేశారని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక రూ. 6 వేలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్లు సైతం పెరగనున్నాయన్నారు. కేవలం దివ్యాంగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు ప్రవేశపెడుతూ విజయవంతంగా అమలు చేసి దేశానికి దిక్సూచిగా మారారని అన్నారు. రేషన్కార్డు ఉన్న వాళ్లందరికీ రూ. 5 లక్షల బీమాతో పాటు సన్నబియ్యం అందించనున్నారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచారని, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ. 3 వేలు అందనున్నాయన్నారు. డబుల్బెడ్ రూం, గృహలక్ష్మి, దళితబంధులో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ ఇప్పించిన ఘనత వాసుదేవారెడ్డికే దక్కుతుందన్నారు. దివ్యాంగులు అడగకుండానే పెన్షన్ను పెంచారన్నారు. భూపాలపల్లిలో నిర్మించిన దివ్యాంగుల భవనంలో టీవీ, బెడ్లు, పేపర్లు అందుబాటులో ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తాను గెలిచాక పెన్షన్ రాని వారందరికీ సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తానని గండ్ర హామీ ఇచ్చారు. అనంతరం భూపాలపల్లి ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు వాసుదేవారెడ్డి సన్నిహితుడని, సమస్యలను ఎప్పటికప్పుడు సీఎంకు వివరిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. దివ్యాంగ ఓటర్లు 6 వేల మంది ఉండగా కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 20 వేల ఓట్లు గండ్ర వెంకటరమణారెడ్డికే వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్ మాట్లాడుతూ భూపాలపల్లిలో ఉన్న దివ్యాంగుల వసతి గృహంలో తాను టీవీని ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి, వాసుదేవారెడ్డి స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు మున్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాంసాని నర్సింగరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంగల రమేశ్, దివ్యాంగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వంగ నర్సయ్య, జాగృతి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి, జిల్లా నాయకుడు కిష్టస్వామి తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ పెంచిన ఘనత కేసీఆర్దే కేతిరెడ్డి వాసుదేవారెడ్డి
కాంగ్రెస్ హయాంలో రూ.500 పెన్షన్ దివ్యాంగుల కు ఇచ్చే వారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత రూ. 4 వేలు ఇస్తున్నారని, ఎన్నికల తర్వాత రూ. 6 వేలకు పెం చనున్నారని వాసుదేవారెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్లో కాం గ్రెస్ ప్రభుత్వం రూ. 200 పెన్షన్ ఇస్తున్నదని, కర్ణాటకలో రూ.1100 చేశారని, గుజరాత్లో ఇటీవలె రూ.1000కి, రాజస్థాన్లో రూ.1500లకు పెంచారన్నా రు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఎక్కడ కూడా రూ.1500 దాటి పెన్షన్ ఇవ్వడం లేదని, ఇక్కడ వారు గెలిస్తే రూ. 5 వేలు ఇస్తామంటే నమ్మేవారు లేరన్నారు. అధికారం కోసం ఇతర పార్టీలు చెప్పే మాయ మాటలు నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇస్తున్న పెన్షన్లు ఏ రా ష్ట్రంలోనూ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఎవరైనా సరే తిన్న రేవును తలవాలని, దివ్యాంగులను ఆదరిస్తున్న సీ ఎం కేసీఆర్ను గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భం గా గండ్ర వెంకటరమణారెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని దివ్యాంగులు తీర్మానం చేశారు.