హనుమకొండ, జూన్ 20 : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి ఎన్నికల నిర్వహణపై సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధం కావాలన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికి ఓటు హకు కల్పించేలా పకడ్బందీగా రెండో విడుత ఓటరు జాబితా రూపొందించాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను సమగ్ర సమాచారంతో పునఃపరిశీలించి, పూర్తి నివేదికలను వెంటనే సమర్పించాలన్నారు. అధికారులు సమష్టిగా కృషి చేసి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వంద శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా జిల్లా అధికారులు పనిచేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు సిబ్బందిని సమాయత్తం చేయాలని తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిచాలన్నారు. ఎన్నికల సమయంలో అనుమానాలు సృష్టించేలా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను సకాలంలో తిప్పికొట్టేలా సోషల్ మీడియా బృందాలను నియమించాలన్నారు. ఎన్నిక నిర్వహణలో ప్రజలకు కచ్చితమైన, ప్రామాణికమైన సమాచారం ఇవ్వడం అధికారుల భాద్యత అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నియోజకవర్గాల ఆధారంగా జాబితాను రూపొందించాలని సూచించారు. అక్రమ మద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు మద్యం వ్యాపారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, అశ్వినీ తానాజీ, పరకాల ఆర్డీవో రాము, ఎన్నికల సూపరింటెండెంట్ జ్యోతి వరలక్ష్మి, తహసీల్దార్లు జీ రాజ్కుమార్, కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.