ములుగురూరల్, డిసెంబర్ 30 : రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్న కుటుంబానికి వంట గ్యాస్ ధర కష్టాలు తెచ్చిపెడుతోంది. సిలిండర్ ధర విపరీతంగా పెరగడంతో ఓ అవ్వ కిలోమీటర్ నడిచి కట్టెలు తీసుకొస్తున్నది. మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో నెల రోజులుగా మంతపూరి మిరియమ్మ కట్టెల పొయ్యిపై అన్నం వండుతున్నది. కిలోమీటర్ దూరంలో కట్టెలు దొరికే ప్రాంతానికి ఉదయం 7గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి దారి పడుతున్నది. అటుగా వెళ్లిన ‘నమస్తే’ అవ్వను మందలించగా తన బాధను వెల్లబోసుకుంది. తాను, తన భర్త కూలీ పనులు చేసుకునే స్థితిలో లేమని, తన భర్తకు ఆసరా ఫించన్ కింద రూ.2వేలు సీఎం కేసీఆర్ నెలనెలా ఇస్తున్నాడని తెలిపింది.
తన తల్లి కూడా తమతోనే ఉంటుందని చెప్పింది. ఇంట్లో వంట గ్యాస్ ఉన్నా సిలిండర్ నింపుకునేంత డబ్బులు లేవని, వచ్చే పింఛన్లో రూ.1150 గ్యాస్కే పోతే ఏం తిని బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే గ్యాస్ పొయ్యిని మూలకు పడేసి కష్టమైనా.., నష్టమైనా.., కట్టెల పొయ్యి మీద నాలుగు మెతుకులు వండుకునేందుకు రోజుకు సరిపోయే నాలుగు కట్టెలను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్తానని తెలిపింది. మిరియమ్మకు ముగ్గురు కొడుకులు, కూతురు. వీరిలో కొడుకులు హనుమకొండలో కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర నిరుపేదల కుటుంబాల్లో పెనుభారంగా మారిందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు.