ఖిలావరంగల్, ఆగస్టు 7 : కాకతీయుల పౌరుషానికి దర్పణంగా నిలిచే శత్రుదుర్భేద్యమైన కోటలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాకతీయుల అద్భుత శిల్ప కళాసంపద, చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవిష్యత్తరాలకు అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాకతీయుల పరిపాలన దక్షత, వారి ఠీవి, చారిత్రక సౌధాలు.. అగడ్తలు పరిరక్షించాలన్న తలంపు కేంద్రానికి లేదు. ఫలితంగా శతాబ్దాల చరిత్ర కలిగిన కాకతీయుల కళా ఖండాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కాకతీయుల సామ్రాజ్యానికి రక్షణగా ఏడు కోటలు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. అయితే, ప్రస్తుతం మూడు కోటలు కనిపిస్తున్నా అందులో పుట్ట కోట మాత్రం మొరం మాఫియాకు బలైపోయింది. అక్కడక్కడున్న పుట్ట కోట ఆనవాళ్లు కేంద్ర పురావస్తు శాఖ తీరును వెక్కిరిస్తోంది. ఎవరైనా చారిత్రక విధ్వంసానికి పాల్పడితే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాల్సిన ఆ శాఖ నోటీసులతో సరిపెట్టుకుంటుంది. దీంతో కోటలకు ఆనుకొని ఉన్న అగడ్తలు ఇప్పటికే మాయమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఒకప్పుడు ప్రకృతి అందాలతోపాటు ఎటు చూసినా అబ్బరపరిచే శిల్ప కళా సౌందర్యం నేడు శ్మశాన వైరాగ్యాన్ని తలపింపజేస్తోంది.
మొరం మాఫియాకు బలైన పుట్ట కోట
కాకతీయుల ఏలుబడిలో నిర్మించిన కోటల్లో ఒకటి పుట్టకోట. ఇది 12.5 కిలోమీటర్ల వ్యాసము కలిగి ఉంది. పుట్ట కోట వంచనగిరి, వెంకటాపురం, బొల్లికుంట, కొండపర్తి, మొగిలిచర్ల, పైడిపల్లి, ఆటోనగర్ తదితర గ్రామాల్లో విస్తరించి ఉన్నట్లు అక్కడక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ కోటను కేంద్ర పురావస్తు శాఖ తమ పరిధి కాదని వదిలేయడంతో మొరం మాఫియాకు కలిసోచ్చింది. భారీ కోటకున్న రాక్షస మొరాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కాలగర్భంలో కలిసిపోతున్న మట్టి కోట
మట్టికోటకు ఆనుకొని సుమారు 80 మీటర్ల వెడల్పుతో ఉన్న అగడ్త అన్యాక్రాంతమైంది. పట్టాలు, రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ కోట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే, కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అగడ్త 95 శాతం మేర కనుమరుగై పోయిందని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేశారు. 60 అడుగుల ఎత్తుతో 200 అడగుల వెడల్పుతో 2.4 కిలోమీటర్ల వ్యాసార్థం, 7.2 కిలోమీటర్లు చుట్టూ శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది మట్టి కోట. ఈ మట్టి కోటకు తూర్పు, పడమర ప్రధాన ద్వారాలు ఉండగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంతోపాటు ఉత్తర, దక్షిణంవైపున్న ద్వారాలు కేవలం కాలినడకే పనికి వచ్చేలా నిర్మించారు. ఇందులో మట్టికోట గర్భంలో ద్వారాలకు అతి సమీపంలో 8 త్రికూటాలయాలున్నట్లు వాటి ఆనవాళ్లు కళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. మట్టికోట గర్భంలో ఉన్న త్రికూటాలయాలను వెలుగులోకి తీసుకువచ్చి పర్యాటకులకు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
కూలుతున్న శత్రుదుర్భేద్యమైన రాతికోట
4.5 కిలోమీటర్ల చుట్టూ 1.2 కిలో మీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్న ఈ కోటకు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణంవైపు నాలుగు సింహద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు శత్రువులను సైతం అయోమయానికి గురిచేసేవిగా నిర్మించి ఉండడం విశేషం. అలాగే, రాతికోటపై 42 బురుజులు వాటి మధ్య ఫిరంగులు ఏర్పాటు చేసుకునేలా శత్రుదుర్భేద్యంగా వీటిని నిర్మించారు. ఇంత గొప్పగా నిర్మించిన రాతికోట కూడా శిథిలావస్థకు చేరుకుంది. రాతికోట ఉత్తర ద్వారం నుంచి తూర్పు ద్వారం మధ్యలో ఇదివరకే గోడ కూలిపోయింది. భారీ వృక్షాలకు తోడుగా వర్షాల కారణంగా బురుజులు, కోట గోడలు పగుళ్లు వచ్చాయి. రాతికోటపై లోపల వైపు వర్షాలకు ఒర్రె కొట్టింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాకతీయుల ఖిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి, పరిరక్షించాలని పర్యాటకులు కోరుతున్నారు. లేకుంటే కాకతీయుల ఆనవాళ్లు ఇక్కడ ఉండేవని చెప్పుకునే పరిస్థితి దాపురిస్తుందని చరిత్రకారులు, పర్యాటకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.