నర్సంపేట, జూన్ 6: నర్సంపేట నియోజకవర్గంలో ఊరూరా చెరువుల్లో జలకళ సాకారమైంది. రూ. 561 కోట్లతో పాకాల, రంగాయ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గోదావరి జలాల రాకతో మండే ఎండా కాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. సీఎం కేసీఆర్ కృషి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో గోదారమ్మ పరవళ్లు తొక్కగా ఇక్కడి రైతులు పులకించిపోయారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించనున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
సీఎం కేసీఆర్ పట్టుదలతో నిధులు
నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు పాకాల నీటినే ప్రధాన అంశంగా తీసుకునేవి. పాకాలకు శాశ్వత జలవనరులను తరలిస్తామని హామీ ఇవ్వడం వరకే సరిపోయింది. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో కేసీఆర్ నర్సంపేట ప్రాంతానికి వచ్చి పాకాల చెరువు పరిసరాల్లో తిరిగారు. అప్పట్లోనే పాకాలకు శాశ్వత జలవనరులను కల్పించాలన్నారు. రాష్ట్ర సాకారం అనంతరం సీఎం అయ్యాక అధికారులతో అంచనాలు వేయించి గోదావరి జలాలను మళ్లింపు పనులు చేయించారు. దీనికి రామప్ప నుంచి పాకాలకు, రంగాయ చెరువులకు గోదావరి జలాలను రప్పించేందుకయ్యే నిధులు విడుదల చేశారు. ప్రత్యేక పర్యవేక్షణతో పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పలు దఫాలుగా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల పర్యవేక్షణలో ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో రామప్ప-పాకాల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 336 కోట్లు వెచ్చించింది. పాకాల-రంగాయ ప్రాజెక్టుకు రూ. 225 కోట్లు ఖర్చు చేసింది. అత్యధికంగా నిధులు వెచ్చించి బృహత్తర ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించారు. మూడున్నర ఏళ్లలోనే పనులు పూర్తి చేయించారు.
ఇరిగేషన్ సర్క్యూట్ సక్సెస్
నర్సంపేట నియోజకవర్గంలో ఇరిగేషన్ సర్క్యూట్ను నిర్ణయించి, అందులో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. దాన్ని ప్రణాళిక పరంగా పూర్తి చేయించారు. రూ. 8 కోట్లతో మాదన్నపేట మినీ ట్యాంక్బండ్ పనులు మంజూరు చేయించారు. అలాగే, పాకాల వాగు నీరు వృథా కాకుండా 13 చెక్డ్యాంలను మంజూరు చేయించి, 39 కిలో మీటర్లు రూ. 36 కోట్లతో నిర్మిస్తున్నారు. చెరువుల పునర్నిర్మాణ పనులు చేయించారు. దీనివల్ల 1,26,099 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రూ. 66 కోట్లతో మిషన్కాకతీయ ఫేస్-1, 2, 3, 4 ద్వారా 272 చెరువులను అభివృద్ధి చేశారు. దీనివల్ల 32,287 ఎకరాలను స్థిరీకరించారు. ఎస్సారెస్పీ డీబీఎం 38, 40, 48 కాల్వల ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని 46,333 ఎకరాలకు సాగునీరు అందించారు. వీటివల్ల గతంలో ఒక్క పంటకే నీరు అందే పరిస్థితి నుంచి నేడు రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. దీంతో రైతులు దిగుబడి అధికంగా సాధిస్తున్నారు. ఊరూరా చెరువుల్లో జళకళతో వేసవిలోనూ పశుపక్షాదులు, జంతు జీవరాశికి నీరు అందుబాటులోకి వచ్చింది. చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో భూగర్భ జలమట్టాలు పెరిగిపోయాయి. దీంతో వ్యవసాయ బావుల్లోనూ నీరు సమృద్ధిగా ఉంటున్నది.
రైతుల కల సాకారమైంది
గోదావరి జలాలను నర్సంపేట ప్రాంతానికి రప్పించడం వల్లే రెండు పంటల సాగుకు నీరు సమృద్ధిగా వస్తున్నది. దిగుబడి అధికంగానే వస్తున్నది. రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో రోజుల తరబడి ఎదురుచూడడం వల్ల పంటలకు సకాలంలో నీరు అందించలేక ఎండిపోయేవి. దీనివల్ల దిగుబడి తగ్గిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టులను నిర్మించడం వల్ల రైతులకు మేలు కలుగుతున్నది. రైతులు ఆశించిన మేరకు నీరు అందుతున్నది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు గ్రామాల్లోని చెరువులను నింపుకుంటున్నారు. ఎండకాలంలోనూ నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంటున్నది.
– బొంత కుమారస్వామి, రైతు, చెన్నారావుపేట
ప్రాజెక్టుతో శాశ్వత జలవనరులు
పాకాలకు శాశ్వత జలవనరులను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక పాకాలకు శాశ్వత జలవనరులను కల్పించి పనులు మూడున్నరేళ్లలో పనులు పూర్తి చేయించారు. గోదావరి జలాలను పాకాలకు తీసుకుని రావడం వల్ల పాకాల ఆయకట్టుదారుల్లో సాగునీరు అందుతుందని నమ్మకం కలిగింది. రెండు పంటలను పూర్తిగా సాగు చేసుకుంటున్నాం. రైతులకు సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా చేశారు.
– జాటోత్ సదర్లాల్, రైతు, కొత్తూరు