జయశంకర్ భూపాలపల్లి, జనవరి 3(నమస్తే తెలంగాణ) : ఉద్యాన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి.. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు కలుపు నివారణ మందులు చల్లడం, కలుపు తీయడం వంటి ఎలాంటి ఖర్చులుండవు. ఒక ఎకరంలో మల్చింగ్ పద్ధతిలో పంటలను సాగు చేసేందుకు సుమారు రూ.12వేల వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత విత్తనాలు విత్తిన నాటి నుంచి పూర్తిగా పంట ఎండిపోయే వరకు ఎలాంటి కలుపు నివారణ పనులు చేయాల్సిన అవసరం లేదు. రైతులు మామూలుగా పండించే పంటల కంటే మల్చింగ్ పద్ధతితో 30 శాతం అధికంగా సాగు చేసుకోవచ్చని ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు.
ఈ పద్ధతిలో 25, 60, 50, 75, 100 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ షీట్ను పూలు, పండ్ల తోటలతో పాటు కూరగాయల మొక్కల పొరలు బోదెలపై కప్పి ఉంచాలి. పండ్ల తోటలకు 75 నుంచి 100 మైక్రాన్లు, పూలు, పండ్ల తోటలు ఇతర స్వల్పకాలిక పంటలకు 25, 30, 50 మైక్రాన్ల షీట్లను వినియోగిస్తారు. ఈ పద్ధతిలో సాగు చేసేందుకు హెక్టారుకు రూ.35 వేలు ఖర్చ వుతుంది. పంటలను సాగు చేసుకునేందుకు రైతు పొలం చదును చేసిన తరువాత విత్తనాలు విత్తే సమయంలో మల్చింగ్ కవర్ను తీసుకొని ముందుగా పొలంలో ప్రతి మల్చింగ్ కవర్కు నాలుగు ఫీట్ల దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత డ్రిప్పు ద్వారా పంటకు నీరు చేరే సమీపంలో విత్తనాన్ని విత్తే ప్రదేశంలో మల్చింగ్ కవర్కు చిన్న రంధ్రం ఏర్పాటుచేసి అందులో విత్తనానికి విత్తనానికి మధ్య సుమారు 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తాలి. ఇలా ఏర్పాటు చేసిన మల్చింగ్ కవర్ ద్వారా సుమారు మూడు సార్లు అదే ప్రదేశంలో విత్తనాన్ని విత్తుకొని పంటలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.