యాదగిరిగుట్ట, జనవరి 31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విష్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో ఉత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు.
ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్టించి పూజలు చేశారు. పారాయణికులు, రుత్వికులకు ఆలయ ఈవో ఎన్ గీత దీక్షా వస్ర్తాలను అందజేశారు. జగద్రక్షకుడైన పరమాత్రమను మూలవరులకు, ఉత్సవమూర్తులకు ఆగమశాస్ర్తానుసారం రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆలయంలో అంకురారోపణ, మృత్సంగ్రహణం వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. కాగా, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.