కాజీపేట, డిసెంబర్ 26 : జిల్లా కాజీపేట పట్టణం విష్ణుపురిలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకుడు, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, రాష్ట్ర విధ్వత్ సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి(60) అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం శివైక్యం చెందారు. తల్లిదండ్రులు అయినవోలు పుష్పలత, వెంకటేశ్వరశర్మ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామం నుంచి బతుకుదెరువు కోసం హనుమకొండ జిల్లా (ఉనికిచర్ల), దేవన్నపేటకు వలస వచ్చారు. అనంత మల్లయ్య శర్మ 18 నవంబర్ 1963లో అక్కడే జన్మించారు. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీన 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
భద్రకాళి దేవస్థానానికి పదేండ్లకు పైగా ఆస్థాన సిద్ధాంతిగా కొనసాగారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి బాధపడగా, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ మరణించారు. ఆయనకు భార్య శారదాదేవి, కుమారులు రాధా కృష్ణశర్మ, సాయి కృష్ణ శర్మ ఉన్నారు. కాగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, ఎలకంటి రాములు, జక్కుల రమా రవీందర్యాదవ్ సంతాపం తెలిపారు. అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి అంత్యక్రియలు కాజీపేట పట్టణంలో బుధవారం నిర్వహించనున్నారు.