స్టేషన్ఘన్పూర్, జనవరి 7: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామంలో శుక్రవారం రాత్రి 11గంటలకు దారుణ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంట్లో చొరబడి నులుక మంచంలో పడుకున్న వ్యక్తి కంట్లో పిండి చల్లి, ముఖానికి గుడ్డ చుట్టి నిప్పుపెట్టాడు. ఎదురింటి వారు మంటలను ఆర్పడంతో సదురు వ్యక్తికి ఎలాంటి హాని జరుగలేదు. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు గ్రామానికి చెందిన సంకెండ్ల వెంకన్న శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట నులుక మంచంపై నిద్రిస్తున్నాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియన వ్యక్తి వెంకన్న ఇంట్లోకి చొరబడి సరుకులను చిందరవందరగా పడేశాడు. వెంకన్న కంట్లో పిండిపోసి, ముఖానికి గుడ్డ చుట్టి మంచానికి నిప్పు పెట్టి పారిపోయాడు. మంచం అంటుకుని వెంటనే తేరుకున్న అతడు ముఖానికి కట్టిన గుడ్డను విప్పి కేకలు వేయడంతో పక్కంటి వారు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో బాధితుడికి ఎలాంటి ప్రమాదంలో జరుగలేదు. కాగా, వెంకన్న తన తల్లికి మూడో సంతానం. దేవుడిని నమ్ముకుని ప్రతి సోమవారం జోగు అడుక్కునేవాడు.
హుస్నాబాద్ సమీపంలోని పోతారం గ్రామానికి చెందిన ఉపేంద్రతో వెంకన్నకు వివాహం కాగా, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు జన్మించారు. అందరూ చిన్నవారేనని గ్రామస్తులు తెలిపారు. వెంకన్న అమాయకుడు కావడంతో భార్యదే ఇంట్లో పెత్తనం. కూలి పనులు చేసుకుంటూ, తమకు ఉన్న సుమారు లక్ష రూపాయల విలువైన మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 5 సంవత్సరాల క్రితం వెంకన్న భార్య ఉపేంద్ర తమకు ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన రూ.10 లక్షలను అధిక వడ్డీకి ఆశపడి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇవ్వడమే కాకుండా, గ్రామంలోని కొందరి పరపతి సంఘం చీటీలు తీసుకుని అదే వ్యక్తికి ఇచ్చింది. ఉపేంద్ర తాను ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించమని ఆ వ్యక్తిని కోరగా ‘నీకు అప్పులేను.. కాగితాలు తీసుకొస్తే ఇస్తాను’ అనడంతో ఎలాంటి కాగితాలు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితిలో పడింది. అప్పులు ఇచ్చినవారు ఉపేంద్రను వేధించగా ఇల్లును అమ్మి బాకీలు చెల్లిస్తామని వారికి సర్దిచెప్పింది. ఇందుకు భర్త వెంకన్న ఒప్పుకోకపోవడంతో గొడవ పడి 15 రోజుల క్రితం తమ పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ అల్లె రాఘవేందర్ తెలిపారు.