హనుమకొండ సిటీ, ఫిబ్రవరి 18: వరుసకు అక్కాచెల్లెళ్లు.. ఉద్యోగ పోటీ పరీక్షలు రాసి చెరో నాలుగు కొలువులు కొట్టి సత్తా చాటారు. బండి హిమబిందు, కొప్పుల చైతన్య కజిన్ సిస్టర్స్. ఇద్దరూ ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి నాలుగు ఉద్యోగాల చొప్పున సాధించారు. ఖిలా వరంగల్కు చెందిన హిమబిందు, గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన కొప్పుల చైతన్య గత ఏడాది ఆగస్టులో గురుకుల్ బోర్డు నిర్వహించిన పరీక్షలు రాశారు. మే నెలలో ఇంటర్ విద్య బోర్డు (సాంకేతిక విద్య, పాలిటెక్నిక్) నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన గురుకుల్ బోర్డు ఫలితాల్లో వారు డిగ్రీ, జూనియర్, సూల్ మూడు విభాగాల్లో ఎంపికయ్యారు.
తాజాగా ఈ నెల 16న ప్రకటించిన రాష్ట్ర ఇంటర్ బోర్డు పాలిటెక్నిక్ లెక్చరర్ల పోటీ పరీక్షల ఫలితాల్లో హిమబిందు మహిళా విభాగంలో రాష్ట్రంలోనే సెకండ్ ర్యాంకు సాధించగా, చైతన్య మొదటి ర్యాంకు సాధించడం విశేషం. ఇద్దరూ నాలుగు ఉద్యోగాలు సాధించినప్పటికీ చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ (డిగ్రీ లెక్చరర్) పోస్టును ఎంచుకున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్లో నియామక పత్రాలు అందుకున్నారు. కాగా హిమబిందు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే గురుకుల విద్యాలయానికి ఎంపిక కాగా, చైతన్య బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల విద్యాలయానికి ఎంపికైంది.