వరంగల్, అక్టోబర్ 24 : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సాయంత్రం భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. సోమవారం రాత్రి భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంస వాహనంపై భద్రకాళీ అమ్మవారిని ఊరేగించారు. తెప్పోత్సవం కార్యక్రమానికి వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, తెప్పోత్సవం శాశ్వత దాత, వ్యాపారవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం భద్రకాళీ అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపి, చక్రస్నానం చేయించారు. ప్రధాన అర్చకుడు శేషు నేతృత్వంలో పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో భద్రకాళీ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భద్రకాళీ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. పండుగ రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం భద్రకాళీ ఆలయ ప్రాంగణంలో పూలతో అందంగా అలంకరించిన కల్యాణ మండప వేదికపై కల్యాణ మహోత్సవాన్ని ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మూడు రోజుల కిత్రం గంజి కేదారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మగ్గంపై పద్మశాలీ మేళా కమిటీ కళాకారులు నేసిన గద్వాల్ చీరను భద్రకాళీ అమ్మవారికి సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తమైనట్లు అర్చకులు తెలిపారు.