స్టేషన్ ఘన్పూర్, మార్చి 15 : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని, ఇందులో బీజేపీ నుంచి విప్లవ పార్టీల వరకు ఇదే పరిస్థితి నెలకొందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జఫర్గఢ్ మండలం రఘునాథపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్ల మూలంగానే దళితులు రాజకీయంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి సుమారు 75ఏళ్లు అవుతున్నా దేశంలో ఇంకా అంటరానితనం, అసమానతలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా అనేక మంది వెనుకబడి ఉన్నారంటే పాలకులే కారణమన్నారు. రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇంకా హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తున్నదని శ్రీహరి అన్నారు.
ప్రపంచమే కీర్తించే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వారికి హక్కులు కల్పించిన మహనీయుడన్నారు. అంబేద్కర్ విగ్రహాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి రాబోవు తరాలకు మహనీయుడి ఆశయాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తీగల కరుణాకర్రావు. వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, ఎంపీటీసీ శివయ్య, మాజీ సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజేశ్నాయక్, మారపల్లి ప్రభాకర్, సుధాకర్ బాబు, జనార్దన్రెడ్డి, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ఎడ్ల శేఖర్, చంద్రయ్య, చింతల శంకర్, సంపత్, ఎల్లయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.