ఎల్కతుర్తి, జూలై 16 : అన్నం పెట్టే రైతులను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి అథోగతి తప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అన్నదాతలు రాజులా బతికితే ఆ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. ఆదివారం మండలంలోని సూరా రంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి వినోద్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపర్చడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు, ఎన్కౌంటర్లతో ఈ ప్రాంతమంతా రక్తపాతం ఉండేదన్నారు. దీనికి కారణం తెలంగాణకు ఉమ్మడి ప్రభుత్వ పాలకులు ఇవ్వాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు ఇవ్వకపోవడమేనన్నారు. తెలంగాణ రావడానికి అంబేద్కర్ ఆలోచన విధానమే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులను రూ.70వేల కోట్లతో కడితే, రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెసోళ్లు బట్ట కాల్చి మీద వేస్తారని, ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించారు. గోదావరి మీద కాళేశ్వరం, కృష్ణానది మీద పాలమూరు ఎత్తిపోతల పథకాలను కట్టి సాగునీటి సమస్య తీర్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రస్తుతం 18,500మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని, మరో 7వేల మెగావాట్ల ఉత్పత్తికి పెంచి మొత్తం 25వేల మెగావాట్లు ఉత్పత్తి చేసి తీరుతామన్నారు. 2002లో గులాబీ జెండా ఆవిష్కరించినప్పుడే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న కృష్ణన్తో రెండు రోజు లు చర్చించి, దళిత పాలసీని రూపొందించామని గుర్తు చేశారు. అప్పుడే దళితబంధు రూపొందించామని, హుజూరాబాద్ ఎన్నికల కోసం పుట్టింది కాదన్నారు. ఇప్పుడు మిగతా పేద వర్గాల ప్రజలు కూడా తమకు ఇలాంటి పథకం కావాలని అడుగుతున్నారని, వచ్చే 5 ఏండ్లు కూడా మనదే అధికారం ఉంటుంది కాబట్టి, కచ్చితంగా పేదవర్గాలకు ఇస్తామన్నారు. విద్య, వైద్యం మీదనే సీఎం కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టారన్నారు.
అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ మా ట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాడే మహనీయుల విగ్రహాలను పెట్టుకొని స్మరించుకోవడం మన విధి అన్నారు. ఆ దిశగానే అంబేద్కర్, గాంధీ, పీవీ నర్సింహారావు లాంటి వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడ మే కాకుండా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తుచేశారు. సూరారంలో రూ.1.30లక్షల విలువ చేసే చీరలను నేసిన చేనేత కార్మికులున్నారని, అది మనకు గర్వకారణమన్నారు.
అందరూ రాజ్యాంగాన్ని చదవాలి
జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని, అప్పుడే తమ హక్కులు తెలుస్తాయని అన్నారు. అంబేద్కర్ లాంటి మహనీయుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. మతతత్వ సిద్ధాంతంతో ప్రపంచంలో అనేక దేశాలు నష్టపోయాయన్నారు. మన దేశంలో సైతం అలాంటి ధోరణులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో అన్ని మతాలు, కులాలకు సమాన హక్కులను అంబేద్కర్ కల్పించారన్నారు. అనంతరం అతిథులను విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం సూరారం గ్రామంలో చెరువు కట్టపై రూ.1.65కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు మేకల చేరాలు, టైనీ ఐపీఎస్ అంకిత్, సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, ఎంపీడీవో తూర్పాటి సునీత, రైల్వేబోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బూర్గుల రామారావు, కడారి రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి, గొల్లె మహేందర్, పిట్టల మహేందర్, వెంకటేశ్యాదవ్, వేముల సమ్మయ్య, మేకల కోమల, సంపత్రావు, చదిరం నాగేశ్వర్, సాతూరి వెంకన్న, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.