కాశీబుగ్గ, మార్చి18: వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేస్తే వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించొచ్చని హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. ములుగురోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం రెండు రోజుల సమావేశాలను సోమవారం కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ఆమె పరిశీలించారు. పంటల సాగు విధానంలో ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ అనువైన పద్ధతులను అవలంబిస్తే రైతులు గణనీయమైన ప్రగతి సాధిస్తారన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ రావుల ఉమారెడ్డి, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురాంరెడ్డి, డాక్టర్ సుధారాణి, జేడీ రవీందర్సింగ్, శ్రీనివాస్, కళాశాల డీన్ డాక్టర్ బలరాం, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, ఆర్ఈఏసీ సభ్యులు, 11 జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.