Summer heat | సూరీడు సెగలు కక్కుతున్నాడు. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. మొన్నటివరకు వర్షాలతో వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జేఎస్ భూపాలపల్లి జిల్లా తాడిచర్ల(మల్హర్)లో గరిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదైంది. ఇది ఉమ్మడి వరంగల్లోనే అత్యధికం కాగా మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలపైనే రికార్డయింది. ఇలా ఒక్కసారిగా పెరిగిన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 9గంటల నుంచే నిప్పులకుంపటిలా మారడంతో అడుగు బయట పెట్టేందుకు జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రద్దీ తగ్గి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇటు వడగాలులతో పాటు ఎండ తీవ్రతతో ఉక్కపోత మొదలుకాగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వరంగల్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. సగటున 40 డిగ్రీలు నమోదవుతుండగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత కొంత ఎక్కువగానే ఉన్నది. అకాల వానలతో ఈ ఎండకాలంలో ఎక్కువ రోజులు సాధారణ వాతావరణమే ఉన్నది. వానలు ఆగిపోవడంతో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెలలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి.
ఈసారి వానలు, ఆ తర్వాత ఎండలు రావడంతో భిన్నమైన వాతావరణం ఉంటున్నది. ఎండలకు తోడు గాలి లేకపోవడంతో తీవ్రమైన ఉక్కబోత ఉన్నది. ఎండల తీవ్రత మరో వారం రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్, వేసవి సెలవులు కావడంతో ఎండలతో జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎండకాలంలో క్రమంగా వాతావరణం వేడెక్కుతుంది. మార్చి నుంచి మే వరకు ఎండలు పెరుగుతాయి. ఈసారి ఒకేసారి తీవ్రమైన ఎండలు రావడంతో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. చాలామంది జలుబు, జ్వరం లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
ఎండకాలమే అయినా ఇన్ని రోజులు వానలతో వాతావరణం చల్లగా ఉన్నది. ఇప్పుడు తీవ్రమైన ఎండలు వచ్చాయి. పొద్దున ఏడు గంటల నుంచే ఎండలు ఉంటున్నాయి. పది గంటల వరకే జనం రోడ్ల మీదికి రావడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటున్నది. ఎండలతో అన్ని పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. వ్యాపారాలు, పనులు, ఉపాధిపై ఎండల ప్రభావం పడుతున్నది. రోజువారీ కూలీ చేసుకునే వారికి ఇబ్బందికరంగా ఉంటున్నది. ప్రస్తుత ఎండలు కూరగాయల పంటలను, తోటలను బాగా దెబ్బతీస్తున్నాయి.
ఇన్ని రోజులు వానలతో కూరగాయల పంటలకు బాగా నష్టం వాటిల్లింది. రాళ్లవానలతో తోటలదీ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎండలతో ఈ రెండు పంటలకు నష్టం జరుగుతున్నది. తీవ్రమైన ఎండలతో ఆకుకూరల పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు నీళ్లు పెట్టినా వాడిపోయినట్లు ఉంటున్నాయి. ఎండకాలంలో ఉండే వ్యాపారాలు ఇన్ని రోజులు స్తబ్ధుగా ఉన్నాయి. రెండు రోజులుగా కూలర్లు, జ్యూస్ పాయింట్ల, కొబ్బరిబొండాలు, కూల్ డ్రింక్స్ షాపులకు గిరాకీ పెరిగింది.
ప్రస్తుత సీజన్లో తీవ్రమైన ఎండలు సాధారణమే అయినా ఈసారి భిన్నమైన వాతావరణం ఉన్నది. చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తీవ్రమైన వేడిగా మారింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు అందరిపై ప్రభావం చూపుతాయి. పిల్లలపై ఇది ఎక్కువగా ఉంటుంది. ఎండలకు వాంతులు, విరేచనాలు అవుతాయి. ఎండ వచ్చిన తర్వాత నుంచి సాయంత్రం వరకు పిల్లలను ఇంటి నుంచి బయటికి తీసుకుపోవద్దు. కూల్ డ్రింకులు, ఇతర చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎండలు ఉన్నన్ని రోజులు పిల్లలు ఇంటిలో ఉండడమే మంచిది.
– మాగంటి శేషుమాధవ్, పిల్లల డాక్టర్