జనగామ చౌరస్తా, జూలై 29 : జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి బైరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలకు ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2 వేల మంది, ఒకేషనల్ విద్యార్థులు 606 మంది, సెకండియర్ జనరల్ విభాగంలో 968 మంది, ఒకేషనల్ విభాగంలో 363 మంది మొత్తం 3937 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/కళాశాల, ఏబీవీ జూనియర్ కళాశాల, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్లో 2, జఫర్గఢ్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెటలో ఒక్కో కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ (డెక్) సభ్యులు శ్రీధర్ల ధర్మేంద్ర, లలిత పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ
ప్రాక్టికల్ పరీక్షలు..
జనగామ చౌరస్తా, జూలై 29 : జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం జనరల్ విభాగంలో ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షకు 17 మంది హాజరుకావాల్సి ఉండగా, 15 మంది హాజరయ్యారని ఇంటర్ జిల్లా విద్యాధికారి బైరి శ్రీనివాస్ పేర్కొన్నారు. మధ్యాహ్నం జనరల్ విభాగం సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలకు 8 మందికి ఆరుగురు హాజరయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో సెకండియర్ విద్యార్థులు ఆరుగురు హాజరుకావాల్సి ఉండగా, నలుగురు హాజరైనట్లు చెప్పారు.