మామిడి తోటలపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపుతున్నది. ఆలస్యంగానైనా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగి తేలిన రైతన్నలకు ఇప్పుడు కాత లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30 శాతమే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది అధిక వానలతో నష్టం మిగల్చగా, ఈ సారి చలి తీవ్రతతో కాత లేకుండా పోయింది. దీంతో వరుసగా రెండో ఏడాది మామిడి రైతులకు నష్టాలే మిగిల్చాయి.
వాతావరణంలోని మార్పులు సాధారణ వ్యవసాయ, కూరగాయల పంటలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితి ఇప్పుడు పండ్ల తోటలకు వస్తున్నది. అన్ని పరిస్థితులను తట్టుకునే పంటగా గుర్తింపు ఉన్న మామిడి తోటలను ఈసారి ప్రకృతి ఆగం చేసింది. మూడు నెలలు ఆలస్యంగా వచ్చిన పూత నిలువలేదు. ఇప్పుడు ఎక్కడా కాత లేదు. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30 శాతమే ఉంటుందని ఉద్యాన శాఖ అంచనాలు చెబుతున్నాయి.
గతేడాది మామిడి పండ్లు తెంపే సమయంలో అధిక వానలు వచ్చి నష్టం చేశాయి. ఈసారి చలి తీవ్రతతో కాత లేక పంట లేకుండా పోయింది. ఇలా మామిడి రైతులకు వరుసగా రెండోసారి నష్టాలే వస్తున్నాయి. మామిడి పూత సీజన్ నవంబర్ చివరలో మొదలై డిసెంబర్లో పూర్తవుతుంది. మామిడిపై ఈసారి వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉన్నది. డిసెంబర్ నెల మామిడి పూతకు మంచి సీజన్. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా తేడా ఉన్నప్పుడు మామిడి చెట్లలో అంతర్గతంగా ఒకరకమైన ఒత్తిడి కలిగి పూత ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఈసారి పగటి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండడంతో మామిడి పూత రావడంలేదు.
జనవరి ఆఖరు వరకు మామిడి పూతకు అనువైన పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి లేదు. పగలు, రాత్రి చలి వాతావరణమే ఉన్నది. దీంతో అదనులో పూత రాలేదు. ఎండలు మొదలైన ఫిబ్రవరి ఆఖరులో బాగా పూత వచ్చింది. దీంట్లోనూ ఎక్కువగా మగ పూత వచ్చింది. పూత కాయలు కాకుండానే రాలిపోయింది. కొన్ని తోటల్లో మార్చిలోనూ పూత వచ్చింది. ఇప్పుడే పిందెలు తయారవుతున్నాయి. ఎండాకాలంలోపు ఇవి పండ్లు అయ్యే పరిస్థితి ఉండదు. దీంతో ఈ పూత సైతం వృథాగానే మిగిలిపోనున్నది.
తెలంగాణ మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షణాఫ్రికా, కువైట్, ఇరాన్, మస్కట్, చెక్ రిపబ్లిక్, నైజీరియా, మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణలో పండే మామిడి పండ్లకు ఢిల్లీ, ముంబై మార్కెట్లలోనూ మంచి గిరాకీ ఉంటున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు మన రాష్ట్రంలోని మామిడి తోటలను గుత్తగా ఢిల్లీ, ముంబై, నాగ్పూర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు మార్కెట్లకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తారు. ఎగుమతి, రవాణాకు, నాణ్యతకు అనుకూలమైన బంగినపల్లి రకం మామిడి పండ్ల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే ఎక్కువ. మన రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.
వీటిలో బంగినపల్లి రకమే 80 శాతం వరకు ఉంటాయి. మన రాష్ట్రంలో ఏటా 10.30 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మామిడి పండ్లతో ఏటా రూ.1500 కోట్ల వ్యాపారం జరుగుతున్నది. డిమాండ్ ఎక్కువగా ఉండే తెలంగాణలో మామిడి ఉత్పత్తి బాగా తగ్గుతున్నది. ప్రస్తుత సీజన్లో అదనులో పూత వచ్చిన తోటలు చాలా తక్కువగా ఉన్నా యి. ఇలాంటి తోటల్లోనే ఇప్పడు కాయలు ఉన్నాయి. తక్కువ విస్తీర్ణంలోని తోటలే ఇలా ఉండడంతో ఈసారి మామిడి ఉత్పత్తి బాగా తగ్గుతున్నది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఈ మూడు రాష్ర్టాల్లోనే అధికంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మామిడి తోటలు పూర్తిగా కాత లేకుండా పోయాయి. తెలంగాణలోనూ కొద్ది శాతం తోటల్లోనే కాత ఉన్నది. గత వారం వచ్చిన అకాల వానలతో కాత ఉన్న తోటలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. మంచు, పురుగు తీవ్రత ఎక్కువైంది. దీంతో మేలు రకం మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోతున్నది. సమతుల వాతావరణం ఉండే దక్షిణ భారతదేశంలోనే మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి.