వరంగల్, డిసెంబర్ 9: స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె ప్రజారోగ్య విభాగం అధికారులతో స్వచ్ఛ సర్వేక్షణ్ విధివిధానాలపై సమీక్షించారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాలన్నారు. ప్లాస్టిక్ విక్రయదారులు, హోటళ్లు, దవాఖానల యాజమాన్యాలు, వీధివ్యాపారులు, వైన్స్, బార్ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా వ్యర్థాలను రోడ్డుపై వేస్తే బల్దియా టోల్ఫ్రీ నంబర్ 18004251989కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ను ఇప్పటికే ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ మల, మూత్ర విసర్జనకు వీలులేదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ. 5 వేల జరిమానా విధించాలని ఆదేశించారు. సమావేశంలో బల్దియా చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ ఓసిటీ రోడ్డులోని వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి కల్యాణ వేడుకల్లో మేయర్ పాల్గొన్నారు. సీతారామాంజనేయ హరిహరపుత్ర అయ్యప్ప శివ పంచాయతన ఓంకారేశ్వర సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు కల్యాణ వేడుకకు హాజరయ్యారు.