వరంగల్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. దీనికి అనుగుణంగా గతంలోనే చేపట్టిన ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. నిర్దేశిత గడువు మేరకు జాబితా ప్రకటించే పనిలో ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఓటు హక్కు కోసం దరఖాస్తుల అనంతరం చేపట్టే అభ్యంతరాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది.
ఓటర్ల ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసింది. నెల రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల వారీగా మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కరించే ప్రక్రియ కొనసాగనున్నది. సెప్టెంబర్ 28లోపు అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను పూర్తి చేయనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, కొత్త ఓటర్ల చేర్పులతో జాబితాను అక్టోబర్ 1లోగా ప్రచురిస్తారు. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నా రు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో జరగాల్సి ఉంది. 2018లో డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది.
ఓట్ల లెక్కింపు అదే నెల 11న చేపట్టారు. ఐదేండ్ల గడువును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాల సేకరణ వంటివి కొనసాగుతున్నాయి. దీని కోసం జూలై 14న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రెవెన్యూ డివిజన్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా, తహసీల్దార్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. నగర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు.