ఖిలావరంగల్, నవంబర్ 25: కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మరికొందరి అతివేగం.. వెరసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమ భద్రతను తామే విస్మరించి.. తొందరపాటు, ఆరాటంతో అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా కొందరు మృతి చెందడం, మరికొందరు శాశ్వత అంగవైకల్యానికి గురికావడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అన్నికంటే విలువైనది.. పోతే తిరిగిరాని ప్రాణం. అయినా ప్రాణం విలువ లెక్కచేయని కొందరు వ్యక్తులు సామాజిక బాధ్యతను విస్మరించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
నిబంధనలు ఉల్లంఘన
వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనలు తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా వాహనం నడుపుతున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాఫిక్ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా, పోలీసు శాఖలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డ్రైవర్ల అత్యుత్సాహం.. ప్రయాణికుల తొందరపాటు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను కూర్చోబెట్టి మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల వాహనం అదుపుతప్పి బోల్తా పడడం లేదా మరో వాహనాన్ని ఢీకొట్టడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల బాధ్యతారాహిత్యం వల్లే జరిగినట్లు రవాణా శాఖ అధికారుల పరిశీలనలో తేలింది.
తల్లడిల్లుతున్న కుటుంబాలు..
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డల కోరికను తీర్చే విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం వెనుకాడడం లేదు. పిల్లలు అడిగిన బైక్లు కొనిస్తున్న తల్లిదండ్రులు.. వాటి వినియోగం విషయంలో దృష్టి పెట్టకపోవడం అనేక ప్రమాదాలకు కారణమవుతున్నది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది తమ బిడ్డలను కోల్పోయి పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 60 శాతం యువతే. ప్రమాదాల్లో గాయపడి శాశ్వత దివ్యాంగులుగా మారి మంచానికే పరిమితమైన వారు వేల సంఖ్యంలో ఉంటున్నారు. ప్రతి వాహనదారుడు విధిగా నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ నిబంధనలు
మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
మానవ తప్పిదాల వల్లే 85 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ బిడ్డలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి బైక్లు కొనిస్తున్నారు. బైక్తో పాటే నాణ్యమైన హెల్మెట్ను కూడా కొనివ్వాలి. ప్రయాణంలో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చినా లేదా నిబంధనలు పాటించకపోయినా ప్రయాణికులు వాహనాన్ని నిలిపి వేయించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. యువత ట్రిబుల్ రైడ్, మితిమీరిన వేగంతో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
నిబంధనలు పాటించాలి
వాహనదారులు కచ్చితంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్టు, బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. రోడ్డు సామర్థ్యం మేరకే వాహనం నడుపాలి. మితిమీరన వేగంతో వెళ్లి కుటుంబాల్లో విషాదం నింపొద్దు.
-గిరికుమార్ కలకోట, వరంగల్ ఏసీపీ