ఖిలా వరంగల్, ఏప్రిల్ 16: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు పూర్తి సహకారం అందించాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పీ ప్రావీణ్య కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటాయని వివరించారు. వరంగల్ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషను స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలుకు వచ్చిన అభ్యర్థులతోపాటు అనుమతించే వ్యక్తులు, వాహనాలు, తదితర అంశాలను కలెక్టర్ వివరించారు. నామినేషన్ వేయడానికి ముందే అభ్యర్థి పేర ఏదైనా జాతీయ బ్యాంకులో ఎన్నికల ఖర్చుల కోసం కొత్త ఖాతా తెరవాలని సూచించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయినందున అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. సందర్భంగా ప్రచురించే కరపత్రాల విషయంలో ప్రజా ప్రతినిధ్య చట్టంలోని 127-ఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు రూ.95లక్షలకు మించి ఖర్చు చేయొద్దని స్పష్టం చేశారు. డీఆర్వో శ్రీనివాస్, జడ్పీ సీఈవో రాంరెడ్డి, ఈ -డిస్ట్రిక్ మేనేజర్ రాజ్కుమార్, ఎన్నికల పర్యవేక్షకులు విశ్వనారాయణ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ పార్లమెంట్ నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం సీపీ అంబర్ కిశోర్ఝా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అబ్దుల్ బారీ, ట్రైనీ ఐపీఎస్ శుభంనాగ్, డీఆర్వో శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ బారికేడ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, పాయింట్ తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు సూచికబోర్డులు ఏర్పాటు చేసి ఇతరులను ప్రవేశించకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్రూట్నీ సమాచారం అభ్యర్థులకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల పూర్తి ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో చేపట్టాలన్నారు. అభ్యర్థి ఆర్వో గదిలోకి ప్రవేశించగానే కనబడేలా గడియారం ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా మాట్లాడుతూ నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల మేర ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు 30నిమిషాలు ముందే చేరుకోవాలన్నారు. అయూబ్అలీ, ఏసీపీ దేవేందర్రెడ్డి, ఏవో శ్రీకాంత్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.