సుబేదారి/ధర్మసాగర్, మార్చి 13 : హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన తహసీల్దార్ మార్కాల రజని అక్రమాస్తుల చిట్టా బట్టబయలైంది. ఆమె వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ దాడుల్లో తేలడంతో ఈ అవినీతి అధికారి కటకటాలపాలైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 7గంటల వరకు హనుమకొండలోని ఆమె నివాసంతో పాటు ఐదు చోట్ల తనిఖీలు చేసిన అవినీతి నిరోధక శాఖ, మొత్తంగా సదరు అధికారి రూ.12కోట్ల విలువైన ఆస్తులు కూడబెడినట్లు వెల్లడించి అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించింది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల మేరకు హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉంటున్న జమ్మికుంట తహసీల్దార్ మార్కాల రజని నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆరు బృందాలు హనుమకొండలో, గతంలో ఆమె పనిచేసిన ధర్మసాగర్లో, అలాగే మిత్రులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 7గంటల వరకు సోదాలు కొనసాగాయి.
తనిఖీల్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.25లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించి, అకౌంట్ను సీజ్ చేయించారు. ధర్మసాగర్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చోటు అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు చేయగా రజినికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి వివరాలు తెలియలేదు. అనంతరం రజని అక్రమ ఆస్తుల వివరాలను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు.
ప్రభుత్వ విలువ రూ.3కోట్ల 12లక్షలు కాగా బహిరంగ మార్కెట్ విలువ రూ.12కోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుర్తించిన రూ.12కోట్ల అక్రమ ఆస్తుల్లో రెండు అంతస్తుల భవనం, 21 ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, రూ.25లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కిలోన్నర బంగారు ఆభరణాలు, రెండు కార్లు, మూడు బైక్లు, లక్షన్నర నగదు ఉన్నాయని పేర్కొన్నారు. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు హనుమకొండలో తహసీల్దార్ రజనిని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.