ఆమె ఒక సాధారణ రైతు. ఒకప్పుడు ఐదెకరాల్లో సంప్రదాయ పంటలు వేసి నష్టాలు రావడంతో విసిగిపోయి కూరగాయల వైపు అడుగేసి సాగును లాభసాటిగా మార్చుకుంది. అలాగే తన ఊరి ప్రజలకు సేవకురాలిగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తన మార్క్ పాలనతో భేష్ అనిపించుకుంటోంది. ‘పల్లె ప్రగతి’ పనులను గడువుకు ముందే పూర్తిచేసి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దినందుకు ఉత్తమ జీపీ అవార్డును సైతం అందుకొని ఊరికి పేరు తీసుకొచ్చింది. ఇటు రైతుగా, సర్పంచ్గా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిసూ అత్యుత్తమ సేవలతో ఆదర్శంగా నిలుస్తోంది నల్లబెల్లి మండలం నందిగామ సర్పంచ్ నాగులగాని సలేంద్ర. – నల్లబెల్లి, డిసెంబర్ 11
ఇటు వ్యవసాయంలో మెళకువలతో లాభాల పంటలు పండిస్తూనే.. గ్రామ పాలనా వ్యవహారాలు చూసే సర్పంచ్గానూ రాణిస్తున్నదీ మహిళ. తన పనితీరుకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించింది. రా్రష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామంలో సమర్థవంతంగా అమలుచేస్తోంది. ఇలా తన భర్త ప్రోత్సాహంతో ఎవుసం పనులను, సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నందిగామ సర్పంచ్ సలేంద్ర. ఈమెకు గ్రామంలో ఐదెకరాల మాగాణి ఉంది. అయితే ఈ భూమిలో కొన్నేళ్లుగా పత్తి, మిరప, మక్కజొన్న పంటలు సాగు చేసినప్పటికీ లాభదాయకంగా లేకపోవడంతో కూరగాయల సాగు వైపు అడుగులు వేశారు.
కూరగాయల సాగులో ఆశించిన లాభాలు వస్తుండడంతో తన భూమికి సమీపంలో ఉన్న మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా పదెకరాల్లో పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. రెండెకరాల్లో వంకాయ, ఎకరం 20గుంటల్లో కాకర, మరో ఎకరం 20గుంటల్లో చిక్కుడు, రెండెకరాల్లో బీర, సోరకాయ, ఎకరంలో దేశవాళీ టమాట, ఎకరం భూమిలో బెండ, అర ఎకరంలో పచ్చి మిర్చి, మరో అర ఎకరంలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం వేళ గ్రామ పంచాయతీ పనులు చూసుకొని అనంతరం కూలీలతో కలిసి సర్పంచ్ సైతం కూరగాయలు తెంపే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ భర్త నాగేశ్వర్రావు తాము పండించిన కూరగాయలను వరంగల్, హనుమకొండ, ములుగు, నర్సంపేట మార్కెట్లకు తరలించడమే గాక నియోజకవర్గంలోని అన్ని అంగళ్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా ప్రజాప్రతినిధిగా అలాగే ఓ రైతుగా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తూ అత్త్యుత్తమ మహిళగా నిలవడం అభినందనీయం.
ఉత్తమ పనితీరుకు దక్కిన ప్రశంస
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో సర్పంచ్ సలేంద్ర ముందువరుసలో ఉంటారు. గ్రామంలో ఆహ్లాదాన్నిచ్చే పల్లె ప్రకృతివనం, గడువుకు మందే డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణాలు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అంతేగాక గ్రామాన్ని సుందరీకరించేందుకు అన్ని డ్రైనేజీలు, అలాగే వీధులను శుభ్రపర్చి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్ది జిల్లా అధికారుల మన్ననలు పొందారు. ఓ మహిళా సర్పంచ్గా గ్రామంలో చేసిన అభివృద్ధిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సర్పంచ్గా 2021లో గుర్తించింది. ఈ మేరకు నాటి జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత చేతుల మీదుగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సర్పంచ్ అవార్డు అందుకున్నారు.
మార్కెట్లో ధర ఉంటేనే గిట్టుబాటు
కూరగాయల కు మార్కెట్లో ధర పలుకుతేనే గిట్టుబాటు లేదంటే నష్టాలు చవిచూడాల్సిందే. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయల సాగుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే పండించిన కూరగాయలకు మార్కెట్లో గిట్టుబాటు ధరను రైతులే నిర్ణయించేలా చర్యలు చేపట్టాలి, అంతేగాక పలు రకాల నాణ్యమైన విత్తనాలతో పాటు డ్రిప్కు సబ్సిడీ ఇవ్వాలి. దీంతో పాటు అన్ని గ్రామాల్లో కూరగాయల సాగుపై వ్యవసాయ శాఖ ద్వారా రైతన్నలకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
– నాగులగాని సలేంద్ర, సర్పంచ్, నందిగామ