కాజీపేట, డిసెంబర్ 1 : కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్ శౌరీనగర్లో గేదె కవిత(39) -జోసెఫ్రెడ్డి, ఇద్దరు ఆడ పిల్లలతో నివాసముంటున్నారు. కవిత నగరంలోని ప్రైవేట్ దవాఖానలో స్టాఫ్ నర్సుగా, జోసెఫ్రెడ్డి సెయింట్ గాబ్రియల్ హైస్కూల్లో సోషల్ టీచర్గా పని చేస్తారు. గురువారం సెయింట్ గాబ్రియల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కవిత-జోసెఫ్రెడ్డి ఓటు వేశారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు పాఠశాల గేట్ ఎదుట తన భర్త బైక్ ఎక్కుతుండగా ఫాతిమానగర్ నుంచి దర్గా కాజీపేటకు అతి వేగంగా వెళ్తున్న కారు కవితను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయింది. భర్త వెంటనే బైక్ దిగి తీవ్రగాయాల పాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్న కవితను 108 వాహనంలో ఎంజీఎం దవాఖానకు తరలించాడు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు కాజీపేట పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేశారని సీఐ సార్ల రాజు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కవితను ఢీకొట్టిన కారును గుర్తించామని చెప్పారు. కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారకుడైన దొడ్ల వంశీ భార్గవ్పై కేసు నమోదు చేశామని తెలిపారు.
కాగా, వంశీ భార్గవ్ తండ్రి ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా విధులు నిర్వర్తించే దొడ్ల శరత్కుమార్ కుమారుడు కావడం వల్లే కాజీపేట పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు శుక్రవారం కాజీపేట పోలీస్స్టేషన్ను ముట్టడించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వంశీభార్గవ్ పై కేసు నమోదు చేశామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించిన వారు మళ్లీ ఫాతిమానగర్ బ్రిడ్జి వద్ద రాస్తా రోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అటు నిట్ కళాశాల, వడ్డేపల్లి వంద ఫీట్ల రోడ్డు వరకు, ఇటు కాజీపేట చౌరస్తా వరకు బ్రిడ్జికి ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు మడికొండ నుంచి హనుమకొండ వైపుకు వెళ్తున్న వాహనాలను కడిపికొండ ఆర్వోబీ మీదుగా మళ్లించారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు నేతృత్వంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సీఐలు సుజాత, సార్ల రాజు, మడికొండ సీఐ వేణు, ఎస్సైలు లలిత, దీప్తి, నర్సింహారావు, రాజేశ్, సిబ్బంది అక్కడికి చేరుకుని నాలుగు గంటలు కష్టపడి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.