అతడు చేస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా మౌంట్ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి మల్లూరు గుట్టలపైకి వెళ్లి చుట్టూ కలియదిరిగేవాడు. అలా పర్వతారోహణ చేయాలనే ఆలోచన అతని మదిలో బాల్యంలోనే ఏర్పడింది. అదే ఆసక్తి పెద్దయ్యాక అకుంఠిత దీక్షతో ఆఫ్రికాలోని కిలిమింజారో, రష్యాలోని ఎల్బ్రూస్లను అధిరోహించేలా చేసింది. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నదే తన లక్ష్యమని ఇందుకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నాడు మంగపేట మండలం వాడగూడం గిరిపుత్రుడు వాసం వివేక్.
Trekking | ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన వాసం సమ్మయ్య-జమున దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వివేక్ రెండవ వాడు. వివేక్ పస్రా, వరంగల్లో ప్రాంతంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేశాడు. హైదరాబాద్లో ఇంటర్, బెంగళూరులో బీటెక్ చదివాడు. 2011లో తండ్రి సమ్మయ్య మృతిచెందగా, తల్లి కష్టపడి తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి వివేక్ చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసింది. ప్రస్తుతం వివేక్ హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. అయితే చిన్ననాటి నుంచి పర్వతారోహణ చేయాలనే మదిలోని కోరికను తీర్చుకోవాలని 2019 నుంచి ఆ దిశగా దృష్టిసారించాడు. ఇందుకోసం మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచనలు, సలహాలు తీసుకొని ప్రయత్నం మొదలు పెట్టినట్లు వివేక్ తెలిపారు. 2022 అక్టోబర్ 15న ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణ, ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతాలు అధిరోహించాడు. రెండు పర్వతాలు కూడా సముద్ర మట్టం నుంచి 20వేల అడుగుల ఎత్తు ఉన్నట్లు తెలిపారు. పర్వతాల అగ్రభాగానికి చేరుకొని గడ్డ కట్టే ఆ మంచుకొండలపై జాతీయ పతాకాలను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర పటాన్ని ప్రదర్శించడం గొప్ప అనుభూతినిచ్చినట్లు వివేక్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని వివేక్ తెలిపారు. పరిస్థితి అనుకూలించి, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే 2024లో తప్పక సాధిస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. నేపాల్-చైనా సరిహ ద్దులో ఉన్న ప్రధాన పర్వతాలతో పాటు ఏడు ఖండాల్లోని ప్రధాన పర్వతాలన్నింటి పైనా పాదం మోపాలన్న ధ్యేయంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే ఇందుకోసం తనకు ఆర్థికపరమైన సహాయం అవసరమని పర్వతారోహణ సంస్థ ద్వారా ప్రోత్సాహం అందించాలని కోరారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే పర్వతారోహణ చేస్తున్న వివేక్కు తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ ఏడాది జనవరి 6న రాజ్భవన్లో ప్రశంసా పత్రం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో పర్వతారోహణలో తాను అనుకున్న లక్ష్యాలను చేరుకొని దేశానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలకున్నట్లు వివేక్ తెలిపారు.