ఏటూరునాగారం, జనవరి 21: దళితబంధు రెండో విడుత నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోకిల మహేశ్ కోరారు. ఇందుకోసం ఈ నెల 25న ములుగు జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఒక్కరోజు నిరసన దీక్ష చేపడుతున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని లబ్ధిదారులంతా కలిసి రావాలని ఆయన కోరారు. ఈమేరకు ఆదివారం లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రెండో విడుత లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రౌండింగ్ పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయని చెప్పారు. కలెక్టర్ బ్యాంకు ఖాతాలో రూ.26.49 కోట్లను జమచేశారని, అంతేకాకుండా లబ్ధిదారులతో ఖాతాలు కూడా తెరిపించారన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని, ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా నేటికీ జమ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని, అధికారులను లబ్ధిదారులు శాంతియుతంగా కోరుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 25న నిర్వహించే నిరసన దీక్షకు దళితబంధు లబ్ధిదారులు, దళిత సంఘాల నాయకులు, మద్దతుదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల సాధన సమితి అధ్యక్షులు, లబ్ధిదారులు కర్రి శ్యాంబాబు, శ్రీనివాస్, దర్శనాల సంజీవ్, చిన్ని కృష్ణ, రామకృష్ణ, రాజేశ్, చంద్రబాబు, ఓంకార్, రవి తదితరులు పాల్గొన్నారు.