కాటారం, జూలై 31 : భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చాడు. పెళ్లయిన ఆరేళ్లలో… భర్త వేధింపులు తాళలేక.. పలుమార్లు అదనంగా కట్నం తెచ్చినప్పటికీ… ఆ దాహం తీరని భర్త గణేశ్ చివరకు భార్య చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హతమార్చాడు. మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారానికి చెందిన చింత రామచంద్రం, రాజేశ్వరిల రెండో కుమార్తె సౌందర్యను ఒడిపిలవంచకు చెందిన గణేశ్తో 2017లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.5లక్షలు, 10 తులాల బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి కుమారుడు శ్రీతన్ (5), కుమార్తె కృషి (3) ఉన్నారు. మండల కేంద్రంలో గణేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత గణేశ్ అదనపు కట్నం కోసం వేధించసాగాడు. గతంలో ఓమారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. రూ.2లక్షలు అదనపు కట్నం ఇచ్చి అమ్మాయిని మళ్లీ కాపురానికి పంపించారు. కొంతకాలం తర్వాత ఇంకా కట్నం తెమ్మని వేధించడంతో మరోసారి రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఇది చాలదన్నట్లు మరోసారి అదనపు కట్నం కావాలని భార్య సంధ్యతో గొడవపడి పుట్టింటికి పంపించాడు. దీంతో అత్తమామలు మరో రూ.1లక్ష ఇచ్చారు. అయినా తన ప్రవర్తన మార్చుకోని గణేశ్ మళ్లీ కట్నం కోసం ఆదివారం రాత్రి భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు.
ఆవేశంతో అక్క డే ఉన్న రోకలి బండతో తలపై బాదడంతో సంధ్య అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం సంధ్య మృతదేహాన్ని ఆరుబయట ఉన్న బండకు తల తాకి పడినట్లుగా పడుకోబెట్టి ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ రంజిత్ రావు, ఎస్సై అభినవ్ ఘటనా స్థలంకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కాటారం తహసీల్దార్ జీవాకర్ రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించి మహదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, తన కూతురుని భర్త గణేశ్తో పాటు అత్త కమలమ్మ, ఆడబిడ్డలు కలిసి హత్య చేశారని సంధ్య తల్లి కాటారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం గణేశ్పై హత్య, వరకట్న వేధింపుల కేసు, అతడి తల్లి కమలమ్మ, అక్కలు, బావపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. హత్యకు వినియోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకొని గణేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
అనాథలైన ఇద్దరు చిన్నారులు..
అదనపు కట్నం కోసం భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఈ ఘటనలో చిన్నారులు అనాథలయ్యారు. అభం శుభం తెలియని ఆ పసి హృదయాలు తమ తల్లి చనిపోయిందని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని కూడా తెలియకుండా ఘటనా స్థలంలో బిక్కుబిక్కుమంటూ చూస్తుండడం స్థానికుల హృదయాలను కలచి వేసింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పసిపిల్లలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.