పోచమ్మమైదాన్, మే 26: వరంగల్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నర్సంపేట రోడ్డులోని ఓ సిటీ మైదానంలో మూడు రోజుల పాటు జరుగనుంది. 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసి, నోరూరించే చేపల వంటకాలు, సంప్రదాయక రుచులు, సీ ఫుడ్, ఎండు చేపలు, రెడీ టూ ఈట్ చేపలను అందరికీ అందుబాటులో ఉంచనున్నారు. ఫెస్ట్ ద్వారా ప్రజలకు చేపల వంటకాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యం కోసం ఏఏ చేపల ఆహారం తీసుకోవాలో వివరిస్తారు. అలాగే చేపల ఉత్పత్తులు, వినియోగంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 180 మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీలు ఉండగా, ఇందులో 41 మహిళా సొసైటీలు ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్లో ఈ సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేసేలా ప్రోత్సహించనున్నారు. అలాగే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఫెస్టివల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తారు. మూ డు రోజులు నోరూరించే ఫిష్ వంటకాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు.
చేపలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం. వివిధ రకాల చేపల వంటకాలను రుచి చూపించడంతో పాటు వాటిని పరిచయం చేస్తారు. 20 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని మహిళా మత్స్యశాఖ సహకార సొసైటీలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తే వారికీ స్టాల్స్ కేటాయిస్తాం.
– పీ నరేశ్కుమార్ నాయుడు, మత్స్య శాఖ జిల్లా అధికారి
చేపలు అనగానే చేపల ఫ్రై, చేపల పులుసు మాత్రమే చేసుకోవచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు రకరకాల వంటకాలు రుచి చూస్తున్నప్పటికీ ఇంకా తెలియని, కొత్త రుచులు సైతం స్టాల్స్లో అందించనున్నారు. ఫిష్ బిర్యానీ, ఫీతల ఫ్రై, ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లెట్, చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి, స్మోక్డ్ ఫిష్, ప్రాన్స్ పకోడి.. ఇలా ఏకంగా 20 నుంచి 30 రకాల చేపల వంటకాలను అందించనున్నారు. అలాగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా చేపల రకాలు, ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తారు. చేపలను ఏ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో వివరిస్తారు. వలలతో చేపలు పట్టే విధానాన్ని చెబుతారు.