కాశీబుగ్గ, మార్చి 1 : నగరంలోని కాశీబుగ్గ మార్కెట్రోడ్డులో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కాశీబుగ్గలోని కోమాకుల రాజుకు చెందిన జై దుర్గా భవానీ రెడీమేడ్ బట్టల షాపులో అగ్ని ప్రమాదం జరిగి దగ్ధమైంది. షాపులో పూజచేసి అగర్బత్తిని వెలిగించి తాళం వేసి, బయట దైవదర్శనానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో అగర్బత్తితోపాటు బట్టలు అంటుకొని మంటలు కాలిపోయాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పేశారు. అలాగే ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు.