జనగామ రూరల్, ఫిబ్రవరి 7: జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్ట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆస్పత్రిలో బాలిక మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి క్రాప్ లోడ్తో వస్తున్న డీసీఎం పెంబర్తి పెట్రోల్ బంక్ సమీపంలో పంక్చర్ కావడంతో రోడ్డు సైడ్లో నిలిపి టైర్ మార్చుతున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో క్రాప్ ఓనర్ వాటం రాజశేఖర్(34), డ్రైవర్ మున్నా (36) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న బాలిక మిర్యాల శ్రీనిక (8) జనగామ దవాఖానలో మృతి చెందింది. హైదరాబాద్ కొండాపూర్కు చెందిన మిర్యాల దేవేందర్-శ్రావణి దంపతులు కూతురు శ్రీనికతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతిలో దైవదర్శనం చేసుకొని హనుమకొండలోని బంధువల ఇంటికి సోమవారం వచ్చారు.
రాత్రి అక్కడే ఉండి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో పెంబర్తి పెట్రోల్ బంక్ సమీపంలో డీసీఎం వ్యానును ఢీకొన్నారు. శ్రీనిక తల్లిదండ్రులు సీటుబెల్టు ధరించడంతో వారు ప్రమాదం నుంచి బయటపడగా బాలిక మృతిచెందింది. పొగమంచు వల్ల జరిగిందా లేక నిద్ర పోవడం వల్ల ప్రమాదం జరిగిందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. విషయం తెలుసుకున్న సీఐ ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జనగామ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.