ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తే భూమి సారం దెబ్బతింటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రైతు దంపతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. డ్రిప్ సిస్టంను ఏర్పాటు చేసి, సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడి సాధిస్తున్నారు. తమకున్న ఎకరం నాలుగు గుంటల్లో టమాట, కాకర, సోరకాయ, చిక్కుడు, వంకాయ, మిర్చి సాగు చేసి లాభాల పట్టారు జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన ఉప్పరి రాజు దంపతులు.
– జనగామ రూరల్, ఏప్రిల్19
ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తే భూమి సారం తగ్గుతుంది. పంటలు పండే స్వభావాన్ని కోల్పోతుంది. ఎక్కువ మంది రైతులు ఏటా ఒకే భూమిలో వరి పంటను మాత్రమే వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే లాభాలు పొందవచ్చు అని ఉప్పరి రాజు దంపతులు నిరూపించారు. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన ఉప్పరి రాజు వరి సాగును వదిలిపెట్టి కూరగాయల వైపు మళ్లాడు. తక్కువ సమయంలో పంట చేతికి వస్తుండడంతో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో లాభాలను గడిస్తున్నాడు. రాజు పెద్దగా చదువుకోలేదు. తనకున్న రెండెకరాల నాలుగు గుంటల భూమిలో నీరు సరిగా లేక వానలు కురిస్తేనే పంటలు పండేవి. ఉన్న నీటితోనే కొత్తగా ఏదైనా చేయాలనుకు న్నాడు. భార్య శ్యామలతో కలిసి ఎకరం నాలుగు గుంటల్లో మిర్చి, టమాట, వంకాయ, సోరకాయ, కాకరకాయ, చిక్కుడు కాయ, బీరకాయ వేశాడు. ఇప్పుడు అన్ని పంటలు చేతికి రావడంతో భార్యాభర్తలు సాగులో బిజీబిజీగా ఉన్నారు. పండించిన కూరగాయలు చుట్టుపక్కల మండలాల్లు, గ్రామాల్లోని అంగళ్లకు తరలించి విక్రయిస్తున్నారు. జనగామ కూడా దగ్గరలోనే ఉండడంతో మార్కెట్కు తరలిస్తారు.
కూరగాయలతో అధిక లాభాలు..
కరువు ప్రాంతంలో నీరు సరిగా లేకపోవడంతో వర్షాధారంపైనే వరి పండించేవారు. పంట దిగుబడి తక్కువగా వచ్చేది. ఉన్న నీటితో కూరగాయలు పండించాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎకరం నాలుగు గుంటల్లో వీటిని పండిస్తున్నాం. వీటికి రూ. 40 వేల నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టగా 50-60 వేల లాభం వస్త్తోంది. వరి పంటతో లాభాలు తక్కువగా వస్తుండడంతో పాటు ఎప్పుడూ ఆ పంటనే సాగు చేస్తుండడంతో కొత్తగా ఏదైనా సాగు చేయాలనే ఆలోచనతో మేమిద్దరం కలిసి కూరగాయలు పండిస్తున్నాం.
– ఉప్పరి రాజు, ఎర్రగిల్ల పహాడ్, జనగామ
సేంద్రియ ఎరువులతో సాగు..
తన వ్యవసాయ భూమిలో కూరగాయల పంటలను సాగు చేయాలనే సంకల్పంతో డ్రిప్ సిస్టంతో మిర్చి, వంకాయ, టమాట, చిక్కుడు, సోరకాయ, కాకరకాయలను సాగు చేస్తూ నీటిని ఆదా చేస్తున్నారు. కూరగాయలకు తెగుళ్లు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు సేంద్రియ ఎరువులనే ఎక్కువగా వాడుతున్నాడు. ఎంతో మంది రైతులు ఈ దంపతులను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. వీరు కూరగాయల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు.