కాటారం, ఫిబ్రవరి 26 : అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని దంతాలపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై అభినవ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస్(48) వ్యవసాయం చేస్తుంటాడు. ఈ ఏడాది మూడెకరాల సొంత భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. రెండున్నర ఎకరాల్లో రూ.4.50 లక్షల పెట్టుబడితో మిర్చి పంట, మరో మూడున్నర ఎకరాల్లో రూ.2.50 లక్షల పెట్టుబడితో పత్తి పంట సాగు చేశాడు. తెగుళ్లు వచ్చి మిర్చి పంట దెబ్బతినగా, ప్రతికూల పరిస్థితుల్లో పత్తి దిగుబడి రాలేదు. దీంతో సుమారు రూ.7లక్షల వరకు అప్పుల అయ్యాయి.
ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. చిన్న కుమారుడు అక్షయ్ చదువు కోసం రూ.1.30 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేనని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో మహదేవపూర్కు తీసుకెళ్తుండగా మా ర్గమధ్యలో శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.