ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నది. వీరి కొడుకు తాహెర్ షరీఫ్ ఏటూరునాగారంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. తర్వాత హనుమకొండలోని మైనార్టీ పాఠశాలలో సీటు రావడంతో పదో తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత నిజామాబాద్లోని మైనార్టీ కళాశాలలో ఇంటర్ను 2019లో పూర్తి చేశాడు. ఎంబీబీఎస్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న అతడు, ఆర్థిక కష్టాలు ఎదురైనా చదువులో ఎదురీదాడు. రెండేళ్ల పాటు ఇంటి వద్దే ఉండి చదివాడు.
తప్పకుండా ఎంబీబీఎస్లో సీటు సాధిస్తానని తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించాడు. గతేడాది అనుకున్న ర్యాంక్ రాలేదు. ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నా, లక్షలు వెచ్చించలేని దుస్థితి. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. దీంతో తాహెర్ షరీఫ్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించాలని సంకల్పం పెట్టుకొని ఈ ఏడాది కష్టపడి చదివాడు. స్టేట్ లెవల్ 2500 ర్యాంకు సాధించాడు. దీంతో కొత్తగా ఏర్పాటుచేసిన ఖమ్మం మెడికల్ కళాశాలలో సీటు దొరికింది. అతడి కోరిక నెరవేరింది. ఇక వారి కుటుంబంలో ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయి.
– హసీనా, విద్యార్థి తల్లి
మీ స్థోమతకు డాక్టరు ఎలా అవుతారనుకుంటున్నారని మమ్ముల్ని అందరూ తిట్టేది. లక్షలు పోసి చదవాలి తెలుసా అని ఎగతాళి చేసేవారు. అయినా నా కొడుకు మాత్రం ఎవరో ఒకరు సహాయం చేస్తారని నమ్మకంతో చెప్పాడు. నా కొడుకుకు సీటు వస్తుందని అస్సలు ఊహించలేదు. సీఎం కేసీఆరే దేవుని రూపంలో వచ్చి పేదింటి పిల్లలకు ఎంబీబీఎస్ చదివే అవకాశం కలిగించాడు. మేము పడుతున్న బాధలు, కష్టాలు చూడలేక కొడుకు కష్టపడి చదివాడు. 24గంటలు ఇంట్లోనే కూర్చుని కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల నా కొడుక్కు సీటు వచ్చింది. పోయినేడు ప్రైవేటు కాలేజీలో సీటు వచ్చేదే, కానీ పది లక్షలు ఖర్చయితయన్నరు. అన్ని పైసలు ఎన్నుంచి తేవాలె. సీటుపై ఆశపోయింది. నా కొడుకు మాత్రం పట్టు వదలకుండా ఒక సంవత్సరం ఆగుదాం, ప్రభుత్వ కాలేజీలో సీటు సాధిస్తా అన్నడు. ఈ సారి మార్కులు ఎక్కువ వచ్చినయ్. ఖమ్మం మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
ప్రభుత్వ కాలేజీలో సీటు రావడం వల్ల డబ్బులు ఖర్చు కాకుండా ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కింది. నిజంగా ఇది మా అదృష్టం. సీఎం కేసీఆర్ జిల్లాకో కాలేజీ పెట్టి చాలా మందికి న్యాయం చేశారు. నా కొడుక్కు సీటు వచ్చిన విషయం తెలుసుకున్న మా ఇంటి దగ్గరి ఒక పిల్లగాడు నేను కూడా ఎంబీబీఎస్ చదివేందుకు నా తల్లిదండ్రులను ఒప్పించుకున్నానని చెప్పడం సంతోషమనిపించింది. సీటు వచ్చినా అడ్మిషన్తో పాటు మొదటి సంవత్సరం ఫీజు కట్టేందుకు డబ్బులు లేవు. ఆ సమయంలో కొంతమంది దాతలు ముందుకు వచ్చి జాయిన్ కావడానికి ఫీజు డబ్బును అందించారు. ఊరి వాళ్లు చేసిన సహాయం మర్చిపోలేను. నాకు గుండెజబ్బుంది. అందుకే నా కొడుకు కార్డియాలజిస్టు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మా కుటుంబమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటది.
పేదింటి నుంచి ఓ విద్యార్థి, రాష్ట్ర ప్రభుత్వం కృషితో డాక్టర్ కాబోతున్నాడు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడంతో అతడి కల నెరవేరగా ఇప్పుడతను తన ఇంట్లో వెలుగులు నింపనున్నాడు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో తల్లి బట్టలు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. గిరాకీ లేకుంటే మిర్చి కోతకు కూలి పనులకు వెళ్లి పిల్లల చదువులు, కుటుంబ పోషణకు పెద్దదిక్కుగా నిలిచింది. సీఎం కేసీఆర్ చలవతో తమ కుమారుడు డాక్టర్ కాబోతుండడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– ఏటూరునాగారం, సెప్టెంబర్ 23
మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే. ఎంబీబీఎస్ చదువు కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకోలేకపోయాను. ఇంట్లోనే ఉండి సీరియస్గా చదివాను. 2021-22లో వచ్చిన 447 మార్కులకు ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చే పరిస్థితి కన్పించలేదు. ప్రైవేట్ కళాశాలలో చదవాలంటే డబ్బుల్లేవు. నిరాశకు గురికాకుండా పట్టువదలకుండా చదివాను. 497 మార్కులు సాధించాను. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. మన రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కళాశాల ఉండడం వల్లే నాకు సీటు వచ్చింది. ఎంతోమంది చదువుకునేందుకు చక్కటి అవకాశం దొరికింది. నాకు ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– తాహెర్ షరీఫ్, ఎంబీబీఎస్ విద్యార్థి