మహబూబాబాద్ రూరల్, జనవరి 2 : కారు ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండల శివారులో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్సై దీపికారెడ్డి కథనం ప్రకారం.. గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన చింతల సుధాకర్ వినోద దంపతులు, వారి కొడుకు విజయ్ప్రకాశ్(8)తో కలిసి సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడెంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్లడానికి ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఆటో వచ్చిందని రోడ్డు దాటుతున్న క్రమంలో నర్సంపేట వైపు నుంచి కారు వేగంగా వచ్చి బాలుడిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.