వరంగల్, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2014 జూన్కు ముందు : విద్య, ఉపాధి, వైద్యం.. ఇలా పని ఏదైనా ఊరి నుంచి మండలం, జిల్లా కేంద్రం లేదా రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే పెద్ద ప్రయాస. కేవలం జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలన్నా రోజంతా గడిచేది. గతుకులు, గుంతలుపడ్డ ఇరుకైన రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపించేది. గమ్యానికి చేరడం ఆలస్యమవడమే కాదు.. ఒళ్లంతా హూనమై ఇంటికి చేరేది. ఇటు వాహనాలూ వారానికోసారి పాడై రిపేర్లకే ఉన్నదంతా వెచ్చించాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో : ఇప్పుడు ఊరి నుంచి మండలం, జిల్లా కేంద్రమే కాదు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లాలన్నా ప్రయాణం వేగంగా.. సాఫీగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు గ్రామాలను కలుపుతూపెద్ద ఎత్తున సింగిల్, డబుల్, ఫోర్లేన్, లింకు రోడ్లు వేసి అవసరమైనచోట వంతెనలు, కల్వర్టులు, బైపాస్ రోడ్లు నిర్మించడంతో వాహనాల ప్రయాణ వేగం అనూహ్యంగా పెరిగింది. పల్లె రోడ్లపై సగటు వేగం ఇంతకు ముందు గంటకు 20-30 కిలోమీటర్లు ఉంటే, ఇప్పుడు గంటకు 40-50కిలో మీటర్లకు పెరిగింది. అదే హైవేలపై ఇంతకు ముందు గంటకు సగటు వేగం 40-60 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా గంటకు 70-80కిలోమీటర్లకు పెరిగింది.
కాలంతో పోటీ పడితేనే అభివృద్ధి సాధ్యం.. అది వ్యక్తికైనా..! సమూహానికైనా..! సమాజానికైనా..! ఒక ప్రాంతం అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే ముఖ్యంగా ఆ ప్రాంతానికి మెరుగైన రవాణా మార్గాలు ఉండాలి. విద్య, ఉపాధి, వైద్యం, వాణిజ్యం, వ్యాపారం ఇలా అవసరం ఏదైనా ఒక ఊరి నుంచి పక్క ఊరికో.. మండలకేంద్రానికో, జిల్లాకేంద్రానికో.. రాష్ట్ర రాజధానికో వెళ్లాలంటే ప్రయాణం సులభతరంగా.. వేగంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ఊరు అన్నింటా బాగుపడుతుంది. ఇదే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో వేలాది కోట్లు వెచ్చించి ప్రతి ఊరికి మెరుగైన రోడ్లు వేసింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోని అన్ని రోడ్లను విస్తరించింది. అప్పటి వరకు సరైన రోడ్డు మార్గంలేని ఆవాసాలకు, కాలనీలకు కూడా విశాలమైన రోడ్లు వేసింది. ప్రతి ఐదేళ్లకోసారి మరమ్మతులు చేయిస్తున్నది. సింగిల్, డబుల్, ఫోర్లేన్, లింకు రోడ్లతో పాటు అవసరమైనచోట వంతెనలు, కల్వర్టులు, బైపాస్ రోడ్లు నిర్మించడంతో వాహనాల ప్రయాణ వేగం ఊహించని విధంగా పెరిగింది. గతంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లపై గంటకు సగటు వేగం 20-30 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 40-50కి పెరిగింది. ఆర్అండ్బీ రోడ్లపై సగటు వేగం గతంలో 40-60 ఉంటే ఇప్పుడు 70-80 కిలో మీటర్లకు పెరిగింది. స్వరాష్ట్రంలో రోడ్ల విస్తరణ.. అభివృద్ధితో ‘మార్గం’ సుగమమై అద్దాల్లాంటి రహదారులతో జీవన విధానమే మారిపోయింది. క్రమంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార రంగాలు ప్రతి ఒక్కరికీ చేరువయ్యాయి.
సరికొత్తగా ఆర్అండ్బీ రోడ్లు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు పెద్దపీట వేసింది. ప్రస్తుత వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి తెచ్చి విస్తరించింది. వందల కిలోమీటర్ల రోడ్లను పంచాయతీరాజ్ నుంచి ఆర్అండ్బీకి మార్చింది. వెంటనే వీటిని డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసింది. కిలో మీటరుకు రూ.2కోట్ల మేర ఖర్చు చేసి నాణ్యమైన రోడ్లు నిర్మించింది. జిల్లా కేంద్రాల్లో నాలుగు లైన్లు, మండల కేంద్రాల్లో డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల్లోనూ ఇదే ప్రణాళిలు అమలు చేసింది. మండల కేంద్రాలను అనుసంధానం చేసే ప్రతి రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసింది. రూ.218 కోట్లతో 175 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించింది. రూ.917 కోట్లతో 245 కిలో మీటర్ల మేర సింగల్ లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చింది. ఎండీఆర్ ప్లాన్లో రూ.1,219 కోట్లతో 320 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసింది. అర్అండ్బీ రోడ్ల మరమ్మతులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నది. వరంగల్, భూపాలపల్లి సర్కిల్లోని ఆరు జిల్లాల పరిధిలో 885 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.460 కోట్లు కేటాయించింది. దాదాపు పనులు పూర్తికావచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ జనాభా ఉండే వరంగల్ మహానగరంలో రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 130 కిలోమీటర్ల రోడ్లు ఆర్అండ్బీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి హామీల మేరకు, ఆర్అండ్బీ శాఖ నిధులతో ఈ రోడ్లన్నింటినీ ఇటీవలే మరమ్మతు చేశారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లన్నీ కొత్తగా మారాయి.
పంచాయతీరాజ్ పరిధిలో..
2014తో పోల్చితే పంచాయతీరాజ్ రోడ్ల పొడవు రెట్టింపయ్యింది. ప్రస్తుత వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రతి రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అన్ని రకాల ప్రభుత్వ గ్రాంట్లు కలిపి వరంగల్ సర్కిల్ పరిధిలో 7,072 రోడ్లను ప్రభుత్వం డెవలప్ చేసింది. రూ.2,263 కోట్లతో 4,911 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసింది. రూ.666 కోట్లతో కొత్తగా 1,079 రోడ్లు వేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డీఎఫ్) కింద రూ.383 కోట్లతో 684 కిలో మీటర్ల రోడ్లు నిర్మించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి నిర్మించే రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నదది. పీఎంజీఎస్ఐ పథకం కింద రూ.479 కోట్లతో 201 రోడ్లు నిర్మించింది. వీటి పొడవు 656 కిలో మీటర్లు. మొత్తంగా రూ.636 కోట్లతో 2,375 కిలో మీటర్ల పొడువు ఉన్న 746 రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి.
త్వరగా గమ్యం చేరుతున్నం
తెలంగాణ ప్రభుత్వం రహదారులను మెరుగుపరచడం వల్ల త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటున్నం. ఇదివరకు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండేవి. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలపై మండలకేంద్రం, జిల్లాకేంద్రాలకు వెళ్లాలంటే గంటల సమయం పట్టేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం రోడ్లను బాగుచేయడంతో పాటు గ్రామాల నుంచి మండలకేంద్రానికి, జిల్లాకేంద్రానికి కేవలం అరగంటలలోనే వెళ్తున్నాం. మా గ్రామం నుంచి వర్ధన్నపేటకు రావడానికి గతంలో 40 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నం. అలాగే వరంగల్కు వెళ్లాలంటే గంట పట్టేది. కానీ ఇప్పుడు 40 నిమిషాల్లోనే వరంగల్కు వెళ్తున్నాం. దీనివల్ల మాకు సమయం ఆదా అవుతోంది. అంతేకాక బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా రహదారులను ప్రభుత్వం మెరుగుపరచడంతో స్పీడుగా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నాయి.
– భూక్యా మంగ్యా
రహదారులు, బ్రిడ్జిలతో రవాణా సౌకర్యం పెరిగింది
తెలంగాణ వచ్చిన తర్వాత రహదారులు, బ్రిడ్జిలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వం నిర్మించింది. దీంతో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది. ఇంతకుముందు మహదేవపూర్ నుంచి అంబట్పల్లికి, అలాగే కాటారం మండలకేంద్రం నుంచి పెగడపల్లి వరకు మాత్ర మే వెళ్లే సౌకర్యం ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటవీ అనుమతులు తీసుకొని రోడ్లు, బ్రిడ్జిలు ఎక్కువ సంఖ్యలో నిర్మించి మారుమూల గ్రామాలకు కూడా సౌకర్యం మెరుగుపరిచాం. గతంలో వర్షాకాలం వచ్చిందంటే వాగు లు ఉప్పొంగి రాకపోకలు నిలిచేవి. జిల్లాలో వా గులపై బ్రిడ్జిలు నిర్మించడం వల్ల ప్రజలు సకాలంలో గమ్యం చేరుకుంటున్నారు.
– రమేశ్, డీఈ, ఆర్అండ్బీ, భూపాలపల్లి డివిజన్
ఉత్సాహంగా బస్సు నడుపుతున్నా..
హనుమకొండ నుంచి ఏటూరునాగారం వరకు బస్సు నడుపుతుంటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఆరెపల్లి అయ్యప్ప గుడి దాటిన తర్వాత రోడ్డు విశాలంగా ఉండడం వల్ల ఈజీగా వెళ్లి వస్తున్నాం. ఇప్పుడు రోడ్డు పనులు చాలా బాగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ములుగుకు రావాలంటే నీరుకుళ్ల నుంచి చాలా కష్టంగా ఉండేది. సింగిల్రోడ్డు మీద బస్సు నడపాలంటే భయమయ్యేది. వాహనాలు ఎదురెదురు అయినప్పుడు చాలాసార్లు యాక్సిడెంట్లు అయ్యేవి. డ్రైవర్ ఫీల్డ్ అంటేనే నరకంగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్లు వెడల్పు చేసి మార్కింగ్లు ఇవ్వడం వల్ల ఎటుపోయే వాహనాలు అటుపోతున్నాయి. ములుగు జిల్లాలోని అన్ని రోడ్లలో బస్సును టాప్ టూ టాప్గేర్లో నడిపిస్తూ ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేస్తున్నాం.
– ఎ.వీరప్రకాశ్, బస్సు డ్రైవర్, ఏటూరునాగారం
ఏ రూట్లో వెళ్లినా రోడ్లు బాగున్నాయి..
ఇంతకుముందు ఏ రూ టుకు బస్సు నడుపాలన్నా రోడ్లు బా గా లేక డ్రైవర్లు ఇబ్బందిపడేవారు. ఇప్పుడు అన్ని రోడ్లు బాగున్నాయి. సమయం చాలా ఆదా అవుతోంది. నిర్దేశించిన స మయానికి బస్సులు గమ్యస్థానాలకు చే రుకుంటున్నాయి. ఇప్పుడు డబుల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల ఎటువైపు వెళ్లే వాహనాలు అటు సాఫీగా వెళ్తున్నా యి. నాడు సింగిల్ రోడ్లపై బస్సులు నడిపేటప్పుడు టైర్లు, బ్రేక్ లై నర్లు, కమాన్ పట్టీలు దెబ్బతినేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. నిర్ణీత సమయానికి ముందే గమ్యం చేరుతున్నాయి. దీని వల్ల ప్రయాణి కులు సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీకి కూడా లాభాలు వస్తున్నాయి.
– జి.ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్, భూపాలపల్లి
70 కి.మీ. వేగంతో వెళ్తున్నా..
మాది బయ్యారం మండ లం కోటగడ్డ. వృత్తిరీత్యా రోజూ కోటగడ్డ నుంచి మానుకోటకు 18 కిలోమీటర్లు ప్రయాణిస్తా. గతంలో 40నుంచి 50 కి.మీ వేగంతో వెళ్లేది. తెలంగాణ వచ్చిన తర్వాత మానుకోట నుంచి కోటగడ్డ వరకు బీటీ వేశారు. ఇప్పుడు 60నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా. ఇదివరకు ప్రయాణానికి 35నిమిషాలు పట్టేది. ఇప్పుడు కేవలం 20నిమిషాల్లో ఇంటికి చేరుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, వంతెనలు ఎక్కువ సంఖ్యలో నిర్మించారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.
– వరుణ్, ప్రైవేట్ ఉద్యోగి, బయ్యారం