కాజీపేట, జూలై 17 : కాజీపేట రైల్వే జంక్షన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి 62 కిలోల గంజాయి, రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్న ఘటన సోమవారం జరిగింది. కాజీపేట జీఆర్పీ సీఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే జంక్షన్లోని మూడో నంబర్ ప్లాట్ఫాంపై విధులు నిర్వర్తిస్తున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు ఆరు బ్యాగులతో అనుమానంగా కనిపించారు. రైల్వే పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి పట్టుకుని బ్యాగులను తనిఖీ చేయగా, గంజాయి బయట పడిందన్నారు. వారిద్దరిని సిబ్బంది అదుపులోకి తీసుకుని జీఆర్పీ స్టేషన్కు తరలించారన్నారు. బ్యాగుల్లో రెండు కిలోల చొప్పున 31 బెండళ్లలో 62 కిలోల గంజాయి బయట పడిందని, దీని విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాదారులు ఒడిశా రాష్ర్టానికి చెందిన సక్రజిత్ ప్రధాన్, ఆజాద్ తంతి శ్రీకాకుళం నుంచి ముంబాయికి గంజాయి రైలులో తరలిస్తున్నట్లు చెప్పారన్నారు. వీరిపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసును జీఆర్పీ స్టేషన్లో నమోదు చేశామని చెప్పారు. గంజాయిని ఎక్సైజ్ పోలీస్లకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు, ఎస్సై శ్రావణి, జీఆర్పీ ఎస్సై పరశురాములు పాల్గొన్నారు.