నయీంనగర్, ఆగస్టు 25 : అభివృద్ధి, సంక్షేమమే తమ ఎజెండా అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 60వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అనేక కాలనీల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి, మంత్రి కేటీఆర్ సహకారంతో నగరాభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 60వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాసర్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు అందరితో కలిసి పలు సమస్యలపై చర్చించి, 30 ఏళ్ల నుంచి ఉన్న రోడ్డు వెడల్పు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
వడ్డేపల్లి పరిసర ప్రాంతాల్లో కొంత గ్రామీణ వాతావరణం ఉంటుందని, నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. డివిజన్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం, డ్రైనేజీ ఇతర సమస్యల పరిషారం కోసం మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, సీపీ రంగనాథ్తో కలిసి పర్యటించినట్లు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎలుగంటి రాములు, డివిజన్ అధ్యక్షుడు రాంరాజ్ నాయకులు యాదగిరి, నీలం సుహాస్ పాల్గొన్నారు.