వరంగల్, జనవరి 25 (నమస్తేతెలంగాణ) : ఈ ఏడా ది పత్తి రైతుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆరంభంలో భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత చీడపీడలు ఆశించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. తీరా ప్రభుత్వ ‘మద్దతు’ కూడా లభించకపోతుండడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయడానికి కొర్రీలు పెడుతున్నారు. నాణ్యత పేరుతో ఎక్కువ శాతం పత్తిని రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో రైతులు చివరకు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముతున్నారు. పొడవు పింజ పత్తి క్వింటాల్కు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,020, పొట్టి పింజ పత్తికి రూ.6,620. ప్రభుత్వం ఇటీవల జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లాలో 24 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం వివరాలతో కూడిన సాఫ్ట్వేర్ కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉందని, మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తామని ప్రచారం చేశారు. దశలవారీగా జిల్లాలోని 24 సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే మద్దతు ధర దక్కుతుందనే ఆశతో రైతులు ఈ కేంద్రాలకు తరలిస్తుండగా, సీసీఐ నలభై శాతం పత్తిని మాత్రమే కొంటున్నట్లు తెలుస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యత లేదని తిరస్కరిస్తున్నా రు. దీంతో రైతులు విధి లేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో క్వింటాల్కు రూ.వెయ్యికిపైగా కోల్పోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020. వ్యవసాయ మార్కెట్, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్న పత్తికి క్వింటాల్కు రూ.5,800 నుంచి రూ.6వేల వరకు వస్తున్నది. తేమ శాతం 8 నుంచి 12లోపే ఉంటున్నా పత్తిని కొనడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు కుమిలిపోతున్నారు.
జిల్లాలో 4,47,757 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగింది. ఎనుమాముల మార్కెట్ పరిధిలో 3,66,117 క్వింటాళ్లు, నర్సంపేటలో 1,721, నెక్కొండలో 26,779, వర్ధన్నపేటలో 53,140 క్వింటాళ్ల కొనుగోలు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో వ్యాపారులు 7,03,618 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక ఎనుమాములలోనే 6.10 లక్షల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. కేంద్రాల్లో సీసీఐ అధికారులు రిజెక్ట్ చేసిన పత్తిని రైతులు ఎనుమాముల మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తికి జెండా పాట గరిష్ఠ ధర రూ.6,675, కనిష్ఠ ధర రూ.5,600 పలికింది. వ్యాపారులు మాత్రం క్వింటాల్కు రూ.6 వేలకు మించి ధర చెల్లించలేదని తెలిసింది.