హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 19: గత మేడారం జాతరలో ప్రైవేట్ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగాయని, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ పీ సోలమన్ కోరారు. శుక్రవారం వరంగల్ రీజియన్లోని డిపో మేనేజర్లతో మేడారం-2026 జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపోల వారీగా ఆపరేషన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. జాతర జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుందని, భక్తు ల సౌకర్యార్థం నడపాల్సిన బస్సులు, చేయాల్సిన ఏర్పాట్లు, సిబ్బందికి, ప్రయాణికుల సౌకర్యాల గురించి చర్చించారు. సురక్షితంగా మేడారం చేరుకొని సమ్మక-సారలమ్మ దీవెనలు అందుకోవాలన్నారు.
జాతర సందర్భంగా ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 4 వేల బస్సులు నడుపుతుందని, ఈ బస్సు ల్లో మహాలక్ష్మీ ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని తెలిపారు. అధికారులంద రూ ఈ విషయాన్ని ప్రయాణికులందరికీ తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్ఎం దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, డిప్యూటీ ఆర్ఎం పీ మహేశ్, హనుమకొండ బస్స్టేషన్ ఏటీఎం మల్లేశయ్య, వో సైదులు, డీఎంలు ధరంసింగ్, పీ ఆర్పిత, రవిచందర్, రాంప్రసాద్, ఏ ఇందు, కే ప్రసూనలక్ష్మి, కల్యాణి, స్వాతి, అన్ని డిపోల ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.