హనుమకొండ సబర్బన్, జనవరి 1:మొత్తంగా రాష్ట్రంలో గత పాలకుల చేతకానితనం వల్ల మనకు రావాల్సిన పరిశ్రమలు మరో చోటుకు వెళ్లాయనే విషయం మాత్రం ఎవరూ చెప్పరు. ప్రణాళికా లేకుండా విద్యుత్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడంతో అనేక చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మూతపడగా, వేలాది మంది కార్మికులను రోడ్డున పడేలా చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేసి సరఫరా వ్యవస్థకు మెరుగులు దిద్దడమే గాక సొంతంగా కరంట్ను ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకెళ్లి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఫలితంగా మూతపడిన పరిశ్రమలకు మళ్లీ జీవం పోసినట్లయ్యింది. కార్మికులకు చేతినిండా పని దొరికింది. ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు క్యూ కడుతుండడంతో అన్ని ప్రాంతాల నుంచి కూలీల రాక మొదలైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోనే 38,475 ఫ్యాక్టరీలు ఉండగా, ఇందులో లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
గతంలో విద్యుత్ సరఫరా అరకొరగా ఉండేది. రోజులో ఎంత సేపు కరంటు ఉంటుందో చెప్పలేని దుస్థితి. పరిశ్రమలకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆయిదారు గంటల పాటు విద్యుత్ కోతం తప్పనిసరి. దీంతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు నడపడం యజమా నుల తాహతుకు మించిన పనిగా ఉండేది. ఇంధన భారం భరిస్తూ జనరేటర్లతో పరిశ్రమ నడపడం ఆర్థిక భారంగా మారేది. దీంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కొందరు వేరే రాష్ర్టాలకు వలస వెళ్లారు. వారంలో రెండు మూడు రోజులు పవర్ హాలిడేస్ ప్రకటించేవారు. ఇక కుటీర పరిశ్రమల పరిస్థితి మరీ అధ్వానం. ఈ తరుణంలో 2014 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ర్టాల నుంచి కరంట్ కొని కోతల్లేకుండా సరఫరా చేసేందుకు శ్రమించారు. మూతపడిన పరిశ్రమలకు మళ్లీ జీవం పోశారు. అనంతరం మనమే సొంతంగా పెద్ద ఎత్తున విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం. దీంతో ఇక పరిశ్రమలు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
17 జిల్లాల పరిధిలో 38,475 పరిశ్రమలు
పదేళ్ల క్రితం పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే దృష్టి సారించేవి. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు అంతగా ఉండవని భావించేవారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం వచ్చిన ఈ ఏడేళ్లలోనే ఎన్నో మార్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్న 17 జిల్లాల్లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ప్రాంతం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇక్కడ మెజారిటీ విద్యుత్ వినియోగం వ్యవసాయ రంగానికే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల విస్తరణ భారీగా జరుగుతోంది. ఫ్యాక్టరీలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఇతర పరిశ్రమలు కూడా ఇక్కడ నెలకొల్పుతున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు అన్నీ కలిపితే 38, 475 ఉన్నాయి.
ఇందులో అయిదారేళ్లలోనే 5007 పరిశ్రమలు వచ్చాయి. ముఖ్యంగా ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రైస్మిల్లులు నెలకొల్పారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కాటన్ జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఇక మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు, చెరుకు ఇథనాల్, ఎరువుల తయారీ, నిర్మల్లో స్టీల్ ఫ్యాక్టరీలతో పాటు, మహారాష్ట్ర నుంచి అనేక వస్త్ర పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చాయి. నిరంతర విద్యుత్ సరఫరాతో కూలీలకు చేతి నిండా పని దొరుకుతోంది. ఒకప్పుడు జనరేటర్ల మీద ఆధారపడిన కంపెనీలు ఇప్పుడు పూర్తిగా విద్యుత్తోనే నడుస్తున్నాయి. అనేక రాష్ర్టాల నుంచి కూలీలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు యజమానులు వస్తున్నారు. టీఎస్ఐపాస్ దరఖాస్తు చేసుకుంటే సులభంగా విద్యుత్ కనెక్షన్ వచ్చేస్తుంది. కేవలం ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లోనే సమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్లు అంచనా.
నీళ్లు, కరంటు, పైకం.. ఇంకేంగావాలె..
ఖానాపురం : వానకాలం, యాసంగి లో పెట్టుబడికి రంది లేకుంట సాయమైతాండు కేసీఆర్ సారు. ఇదివరకు ఎవుసం చేయాలంటే రైతులు అరిగోసపడేది. ఎరువులు, పురుగు మందుల కోసం అప్పు తేవాల్సి వచ్చేది. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మాకు ధైర్నం అచ్చింది. ఫుల్ కరంటు, పుష్కలం నీళ్లు ఇచ్చుడే గాక అదునుకు పెట్టుబడి సాయం ఇచ్చి ఆసరా అయితాండు. రైతుల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం. అందుకే రైతుల కోసం ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి అమలుజేత్తాండు. రైతులు కూడా పంటలు మంచిగ పండించి నిలదొక్కుకుంటాన్రు. నాకు రెండున్నర ఎకరాలకు రూ.12,500 ఖాతాల జమైనయ్. ఇలాంటి ముఖ్యమంత్రిని పది కాలాల పాటు మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి.
– వేజళ్ల కిషన్రావు, రైతు, ఖానాపురం
దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు టీఎస్ఐపాస్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే మా సిబ్బంది రంగంలోకి దిగుతారు. పరిశ్రమ యజమానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కనెక్షన్ ఇస్తారు. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. మెటీరియల్ కూడా దొరికేది కాదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కావాల్సిన పరికరాలు మా దగ్గర స్టాక్ ఉంచుకుంటున్నాం. అలాగే మా సంస్థ పరిధిలో ఎప్పుడు 5 వేల ట్రాన్స్ఫార్మర్లు బఫర్ స్టాక్గా ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే విషయంలో, నూతనంగా కనెక్షన్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
– అన్నమనేని గోపాల్ రావు, చైర్మన్, ఎన్పీడీసీఎల్